తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు 24 విభాగాల ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో సమావేశం నిర్వహించారు. నిర్మాత జి. ఆదిశేషగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్మాతలు నవీన్ యేర్నేని, బీవీఎస్ఎన్ ప్రసాద్, అనిల్ సుంకర, సి కళ్యాణ్, దామోదర ప్రసాద్, ఎన్వీ ప్రసాద్, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఛార్జీలు, కరోనా కాలంలో థియేటర్లకు విధించిన విద్యుత్ ఛార్జీలు, ఇతర పన్నులు, ఓటీటీ విడుదలకు నిర్దుష్టమైన కాలపరిమితి కేటాయించడం, ఆన్లైన్ టికెటింగ్ నుంచి నిర్మాతకు లేదా పంపిణీదారులకు రావాల్సిన వాటాలు, థియేటర్లలో ట్రైలర్ ప్రచార ఛార్జీలు వంటి అనేక సమస్యలపై చర్చించారు. ఈ సమస్యలపై సూచనలు స్వీకరించేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. మళ్లీ మూడు నెలల తర్వాత సమావేశమై మరోమారు చర్చిస్తామని పాల్గొన్న ప్రముఖులు తెలిపారు. అన్ని విభాగాల నుంచి ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారని, ప్రధానంగా డిజిటల్, కార్మిక సమాఖ్యకు సంబంధించిన సమస్యలపై చర్చ జరిగిందని తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర ప్రసాద్ తెలిపారు.