హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈసెట్) 95 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. అత్యధిక ర్యాంకులను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సాధించారు. టాప్ -10 ర్యాంకర్లలో అత్యధిక ర్యాంకులను ఈ సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులే కైవసం చేసుకున్నారు. బీపీఈడీలో టాప్ 10లో ఏడు ర్యాంకులు, డీపీఈడీ టాప్ -10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. పీఈసెట్ ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. మాసాబ్ట్యాంక్లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. బీపీఈడీలో 96.90 శాతం, డీపీఈడీలో 97.10 శాతం విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. సీట్ల భర్తీకి వెబ్కౌన్సెలింగ్ షెడ్యూల్ను త్వరలోనే విడుదలచేస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. బీపీఈడీ మొదటి ర్యాంకును ఎస్టీ సామాజికవర్గానికి చెందిన అంగోతు కృష్ణవేణి దక్కించుకున్నది. డీపీఈడీ ఫస్ట్ర్యాంక్ను ఎస్సీ కులానికి చెందిన గాజుల సృజన్ సొంతం చేసుకున్నాడు.