“83’ చిత్రంలో క్రికెట్ కంటే ఫ్యామిలీ ఎమోషన్స్ తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు భారత క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్. 1983లో భారత క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ను గెలుచుకొని విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. నాటి చారిత్రక ఘట్టం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘83’. కబీర్ఖాన్ దర్శకుడు. రణ్వీర్సింగ్, దీపికాపడుకోన్, తాహిర్రాజ్బాసిన్, జీవా తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించారు. కపిల్దేవ్ పాత్రలో రణ్వీర్సింగ్ కనిపించనున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో దీపికాపడుకోన్, సాజిద్ నదియావాలా, కబీర్ఖాన్, నిఖిల్ద్వివేది, విష్ణు ఇందూరి నిర్మించారు.
నేడు ఈ చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కపిల్దేవ్ మాట్లాడుతూ ‘ఆనాడు భారత జట్టు తమ కుటుంబాలతో కలిసి చేసిన ప్రయాణం..నాటి అనుభూతులు, ప్రపంచకప్ గెలిచినప్పుడు అందరిలో కలిగిన ఆనందపు క్షణాల్ని ఈ సినిమాల్లో చక్కగా ఒడిసిపట్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామాను అద్భుతంగా ఆవిష్కరించారు. అప్పటి టీం సభ్యులందరం కుటుంబాలతో కలిసి ఇటీవలే సినిమా చూశాం. పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లుపెట్టుకున్నారు.
సినిమాలోని భావోద్వేగాలు అంతలా కదిలించాయి. దాదాపు రెండున్నర సంవత్సరాలు టీమ్ అంతా ఈ సినిమా కోసం శ్రమించారు’ అన్నారు. స్క్రీన్మీద రణ్వీర్సింగ్ను చూస్తుంటే కపిల్దేవ్ను చూస్తున్న అనుభూతి కలిగిందని శ్రీకాంత్ తెలిపారు. ఈ రోజు క్రికెట్ ఓ మతంలా మారిందంటే అందుకు కారణం కపిల్దేవ్ వంటి లెజెండ్స్ అని నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి పేర్కొన్నారు.