అమరావతి
:
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వమే తయారుచేసిన విషయం అందరికీ తెలిసినదే. కానీ టెంత్, ఇంటర్ పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకేలా నిబంధనలు విధించకపోవటం వల్ల, జాతీయ విధానం అంటూ లేకపోవటం వల్ల గందరగోళం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షల ప్రత్యేకత కారణంగానే నిర్వహణకు ప్రభుత్వం తాపత్రయపడిందని, పూర్తిగా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పరీక్షలు జరపాలని భావించామని తెలిపారు. అయినా, దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, పరీక్ష రాయాల్సిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా అభిప్రాయపడినందున పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ విద్యామంత్రి ప్రకటించారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని తెలిపారు.