ఇంఫాల్, ఫిబ్రవరి 28: పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల నడుమే మణిపూర్ తొలి విడుత ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఐదు జిల్లాల్లోని 38 నియోజకవర్గాలకు సోమవారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 78 శాతం ఓటింగ్ నమోదైంది. 1,721 పోలింగ్ స్టేషన్లకు గానూ 381 కేంద్రాల్లో మొత్తం మహిళా సిబ్బందే ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. తొలి విడుతలో 15 మంది మహిళలతో సహా 173 మంది బరిలో ఉన్నారు. మిగతా 22 స్థానాలకు రెండో(చివరి) విడుతగా మార్చి 5న ఎన్నికలు జరుగనుండగా, 10న ఫలితాలు విడుదల అవుతాయి.
మణిపూర్ తొలి దశ పోలింగ్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఛురాచంద్పూర్ జిల్లాలో రెండు పార్టీల కార్యకర్తలు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలు కాగా, పోలింగ్ కేంద్రంలోని ఒక ఈవీఎం ధ్వంసమైంది. కీరావ్ నియోజకవర్గంలో ఎన్పీపీ అభ్యర్థి కారుపై ప్రత్యర్థి మద్దతుదారులు దాడి చేశారు. కాంగ్పోక్పి జిల్లాలోని న్యూకీథెల్మంబి పోలింగ్ కేంద్రంలో బీజేపీ బూత్ను స్వాధీనం చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తిపాయ్ముఖ్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ప్రమాదవశాత్తూ సర్వీస్ రైఫిల్ పేలడంతో డ్యూటీలో ఉన్న నౌరెమ్ ఇబోచౌబా అనే పోలీస్ అధికారి మరణించారని ఎన్నికల ప్రధాన అధికారి రాజేశ్ అగర్వాల్ తెలిపారు.