న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటా అంశంపై హర్యానా ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్-హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. ఇదే సమయంలో యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోటా అంశంపై విచారణ కోసం హైకోర్టు నిర్ణయించిన షెడ్యూల్కు వాద, ప్రతివాదులు హాజరుకావాలని, వాయిదాల ప్రక్రియను తోసిపుచ్చాలని ధర్మాసనం సూచించింది. ప్రైవేటు కంపెనీలు, సొసైటీల్లో నెలవారీ వేతనం రూ. 30 వేల కంటే తక్కువ స్థాయి ఉద్యోగాల్లో 75 శాతం కొలువుల్లో రాష్ట్ర ప్రజలనే నియమించాలని పేర్కొంటూ హర్యానా ప్రభుత్వం ఇటీవల చట్టం తెచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారించిన కోర్టు.. చట్టం అమలుపై స్టే విధించింది. దీనిపై హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.