
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): సాంకేతికత వినియోగంలో దేశంలోనే నంబర్వన్గా నిలిచిన తెలంగాణ ఏకంగా 6 స్కోచ్ అవార్డులను దక్కించుకొన్నది. పోలీస్ శాఖకు ఒక బంగారు పతకం, నాలుగు వెండి పతకాలు వచ్చాయి. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అండ్ స్టాండైర్డెజేషన్ విభాగంలో బంగారు పతకం లభించింది. ఆన్లైన్ ద్వారా మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా స్వీకరించారు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో టీఎస్ ఈ-చలాన్, టీఎస్-కాప్ మొబైల్ యాప్, సాఫ్ట్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ట్రైనింగ్, ఎలక్ట్రానిక్ సర్వేలైన్స్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కలిపి మూడు వెండి పతకాలు రాగా, వాటిని డీజీపీ మహేందర్రెడ్డి అందుకొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్లో పోలీస్ ప్రి-రిక్రూట్మెంట్ ట్రైనింగ్కుగానూ మరో వెండి పతకాన్ని ఏసీపీ ఎల్ రాజావెంకట్రెడ్డి స్వీకరించారు. పౌరసేవల్లో సాంకేతికతను వినియోగించి పారదర్శకంగా (ఎనీవేర్, ఎనీ టైం) సేవలందిస్తున్న రాష్ట్ర రవాణాశాఖకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ స్కోచ్ 2020-21 పురస్కారం దక్కింది. రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు ఈ అవార్డు అందుకొన్నారు. రవాణాశాఖకు అవార్డు రావటం పట్ల ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు.