న్యూఢిల్లీ, జూలై 18: ప్రపంచంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలకే సాధ్యమైన ఘనతను హైదరాబాదీ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సాధించింది. ప్రైవేట్గా నిర్మించిన భారతీయ తొలి రాకెట్ విక్రమ్-1ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో స్కైరూట్ పేరు మార్మోగుతున్నది. శనివారం మధ్యాహ్నం శ్రీహరికోటలోని ఇస్రోకు చెందిన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ఎగిసిన విక్రమ్-1 సక్సెస్ఫుల్గా కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో ఇన్నాళ్లూ జాతీయ స్పేస్ ఏజెన్సీలు, అతికొద్ది ప్రైవేట్ కంపెనీల ఆధిపత్యం కలిగిన అంతరిక్ష రంగంలో స్కైరూట్.. ఓ స్టార్టప్ విప్లవాన్ని సృష్టించినైట్టెంది.
గత కొన్నేండ్లుగా అభివృద్ధి, పరీక్షలు, నిధుల సమీకరణలో మునిగిన స్కైరూట్కు.. విక్రమ్-1 విజయంతో అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశానికి తలుపులు తెరుచుకున్నాయి. అటు వృద్ధి, ఇటు పోటీకి పుష్కలంగా వీలున్న గ్లోబల్ మార్కెట్లో గెలుపుదే ఆధిపత్యం మరి. ఈ క్రమంలోనే జర్మనీ, జపాన్, మిడిల్ ఈస్ట్ లేదా ఆగ్నేయాసియా దేశాల్లోని కస్టమర్లకు ఇక స్కైరూట్ కంపెనీయే హాట్ ఫేవరేట్ అన్న అంచనాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. దేశీయంగా కూడా బడా కార్పొరేట్లు.. అంతరిక్ష ప్రయోగాలపై ఎప్పట్నుంచో ఆసక్తి కనబరుస్తున్నారు. అనేక స్టార్టప్లలో పెట్టుబడులే ఇందుకు నిదర్శనం.
నిజానికి దశాబ్దకాలం క్రితం ఓ శాటిలైట్ను ప్రయోగించాలంటే ప్రభుత్వాలు, భారీ సంస్థల సహకారం ఉండాల్సిందే. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. శాటిలైట్ల పరిమాణం, విలువ రెండూ తగ్గాయి మరి. దీంతో ఇటీవలికాలంలో కక్ష్యలోకి వెళ్లే పేలోడ్స్ సంఖ్య పెరిగిపోయింది. గత ఏడాదే 329 ఆర్బిటల్ లాంచ్లు, 4,587 పేలోడ్స్ లాంచ్లు జరిగాయి. ఇందులో వాణిజ్య పేలోడ్స్ ఎక్కువగా ఉండగా, స్పేస్ఎక్స్ ద్వారానే సగానికిపైగా ప్రయోగాలు జరుగడం విశేషం. ఈ క్రమంలో విక్రమ్-1 విజయంతో ప్రైవేట్ రంగం నుంచి మరిన్ని ప్రయోగాలకు డిమాండ్ రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారతీయ స్పేస్ స్టార్టప్లపట్ల అంతర్జాతీయ మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. పశ్చిమ దేశాలతో పోల్చితే భారత్లో అధునాతన ఏరోస్పేస్ ఉత్పత్తులు తక్కువ ఖర్చుతోనే తయారవుతుండటమే ఇందుకు కారణం. అలాగే ఈ రంగంలో అధికంగా ఉన్న యువ ప్రతిభావంతులు, వారిలోగల నైపుణ్యం కూడా కలిసొస్తున్నది. విక్రమ్-1 విజయంలో పాల్గొన్నవారి సగటు వయసు 28 ఏండ్లేనని స్కైరూట్ తాజాగా చెప్పడం కూడా ఇందుకు నిదర్శనం. ఇక ప్రైవేట్ పెట్టుబడులకు స్కైరూట్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. మొత్తానికి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విక్రమ్-1 విజయం.. కార్పొరేట్లలో స్టార్టప్లపైనున్న నమ్మకాన్నీ అమాంతం పెంచేయగలదన్న అభిప్రాయాలూ వస్తున్నాయి. ఇదిలావుంటే కంపెనీ సక్సెస్ రేటే కీలకమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
కక్ష్యలోకి వెళ్లడమేగాక, నిర్దేశిత లక్ష్యాన్ని సురక్షితంగా చేరుకోవడమే ప్రధానం అంటున్నారు. అప్పుడే పెట్టుబడులు, వ్యాపారాభివృద్ధికి వీలుంటుందని చెప్తున్నారు. విక్రమ్-1 విజయం.. స్కైరూట్పై విశ్వాసాన్ని పెంచగలదని.. ఇన్సూరర్లు, శాటిలైట్ ఆపరేటర్లు, ప్రభుత్వ కస్టమర్లకు ఇదే కావాలని గుర్తుచేస్తున్నారు. ఏదిఏమైనా స్కైరూట్ సక్సెస్తో.. భారతీయ స్పేస్ ఎకానమీ వృద్ధిపథంలో వెళ్లేందుకు మార్గం సుగమమైందనే చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో పెరిగే పెట్టుబడులు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలకూ ఊతమివ్వగలవు. అయితే ప్రభుత్వాలు ఈ మేరకు ప్రోత్సహిస్తేనే ఆశించిన ఫలితాలుంటాయని ఎక్స్పర్ట్స్ గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం అనేక రంగాల్లో అంతరిక్ష ప్రయోగాలకు ఆవశ్యకత ఏర్పడిందని.. రక్షణ, వాతావరణ, ఇంటర్నెట్లకు స్పేస్ కార్యకలాపాలే దన్నుగా నిలుస్తాయని చెప్తున్నారు మరి.

