న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలను ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం త్వరలో స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించనున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో ప్రైవేట్ టెలికం ప్రొవైడర్లు 5జీ సేవలను ప్రారంభించేందుకు వీలుగా ఈ ఏడాది స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహిస్తాం. ఇది టెలికం రంగం అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుంది’ అని ఆమె ప్రకటించారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్, మొబైల్ సేవల వ్యాప్తి కోసం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద వచ్చే వార్షిక వసూళ్లలో 5 శాతం నిధులను కేటాయించనున్నట్టు తెలిపారు. పట్టణవాసులతో సమానంగా గ్రామీణ ప్రజలకు ఎలక్ట్రానిక్, సమాచార సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె చెప్పారు.
డిజిటల్ యూనివర్సిటీ
దేశంలో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం 2022-23 బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు చేసింది. అంతర్జాతీయ స్థాయి విద్యను మన విద్యార్థులకు ఇంటివద్దనే అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్ యూనివర్సిటీని ప్రారంభించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐసీటీ) ద్వారా దేశంలోని అనేక భాషల్లో ఈ యూనివర్సిటీలో విద్యాబోధన సాగుతుందని తెలిపారు. ఇది దేశంలోని అనేక కంపెనీలు, ప్రభుత్వ యూనివర్సిటీకు ఒక నెట్వర్క్ హబ్గా ఉంటుందని పేర్కొన్నారు. సైన్స్, గణితంలో దేశవ్యాప్తంగా 750 వర్చువల్ ల్యాబ్లను నెలకొల్పుతారు. నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు 75 స్కిల్ సెంటర్లు ఏర్పాటుచేస్తారు. భారతీయులను వివిధ రంగాల్లో నైపుణ్యంగల పౌరులుగా తీర్చిదిద్దటం, నైపుణ్యాలను పెంపొందించటమే లక్ష్యంగా దేశ్ స్టాక్ ఈ పోర్టల్ను ప్రారంభించనున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు. నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన కూడా ఇందులో భాగంగా ఉంటాయి. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ‘డ్రోన్ శక్తి’ పథకాన్ని ప్రకటించారు. డ్రోన్ ఆజ్ ఏ సర్వీస్ విధానం ద్వారా వివిధ రాష్ర్టాల్లోని ఎంపిక చేసిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ల లను ఈ పోర్టల్కు అనుసంధానిస్తారు.