హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు మన బడి -మన బస్తీ..మన బడి’లో పాఠశాలల పెయింటింగ్కు రూ.439 కోట్లను వెచ్చించనున్నారు. ఈ నిధులతో మొదటి విడతలో 9,123 బడుల రూపురేఖలను మార్చనున్నారు. రంగులను సేకరించేందుకు విద్యాశాఖ అధికారులు ఇటీవలే గ్లోబల్ టెండర్లు ఆహ్వానించారు. రంగులతోపాటు, గ్రీన్ చాక్పీస్ బోర్డులు, డ్యూయల్ డెస్క్ బల్లలు, ఫర్నిచర్ సేకరణకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు.
ఈ నెల 17 వరకు టెండర్ల దాఖలకు అవకాశముండగా, మొత్తం పనులు 12 మాసాల్లో పూర్తికావాలని గడువు విధించారు. రాష్ట్రంలో మొత్తం 1,39,585 తరగతి గదులుండగా, తొలి విడతలో 71,115 తరగతి గదులకు రంగులు వేయాలని అధికారులు నిర్ణయించారు. గోడలు, సీలింగ్, తలుపులు, కిటికీలు, గ్రిల్స్, గేట్స్, టాయిలెట్లు సహా అన్నింటికీ రంగులేస్తారు.
ఈ రంగులు కనీసం ఏడేండ్ల పాటు ఉండాలని గడువు విధించారు. ఇవి పూర్తయిన తర్వాత పాఠ్యాంశాలపై అవగాహన కల్పించేలా సౌర కుటుంబం, తెలుగు, ఆంగ్ల, అక్షరమాల తదితర పెయింటింగ్స్ వేయిస్తారు. రూ.219 కోట్లతో 2.08 లక్షల డ్యూయల్ డెస్క్ బల్లలను సేకరించనున్నారు. రూ.106 కోట్లతో గ్రంథాలయాలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్, టీచర్లు, హెడ్మాస్టర్లకు కావాల్సిన 3.26 లక్షల టేబుళ్లు, కుర్చీలను సేకరిస్తారు.
పెయింట్స్ (రంగులు) 439,40,08,038
గ్రీన్ చాక్పీస్ బోర్డులు 71,11,43,265
డ్యూయల్ డెస్క్ బల్లలు 219,06,00,000
ఫర్నిచర్ 106,80,00,000