హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ): కార్మికులు, ఉద్యోగులకు సింగరేణి సంస్థ మరో శుభవార్తను చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కార్పొరేట్ సాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగుల ప్రమాద బీమాను రూ. 40 లక్షలకు పెంచింది. ఈ మేరకు సింగరేణి, ఎస్బీఐల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పర్సనల్) ఎన్ బలరామ్, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ సంగ్రామ్ శుక్రవారం కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీంతో ఎస్బీఐలో ఖాతాలున్న 35 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ ఒప్పందం వచ్చే నెల 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నది. సింగరేణి సంస్థ విజ్ఞప్తి మేరకు కార్మికుల ఖాతాలన్నింటినీ కార్పొరేట్ సాలరీ అకౌంట్లుగా మార్చి, ప్రమాద బీమాను రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్టు అమిత్ సంగ్రామ్ తెలిపారు. శాశ్వత అంగవైకల్యం కలిగినా బీమా మొత్తం, పాక్షిక అంగవైకల్యానికి రూ. 20 లక్షల వరకు చెల్లిస్తారని సింగరేణి డైరెక్టర్ బలరాం తెలిపారు. గతంలో ఉద్యోగుల నెలవారీ జీతం పరిమితి ఆధారంగా రూ.10 -20 లక్షల వరకు ప్రమాద బీమా సొమ్మును చెల్లించగా, తాజా ఒప్పందం ద్వారా జీతం, హోదా వంటి పరిమితుల్లేకుండా ప్రతి ఒక్కరికి రూ.40 లక్షల బీమా వర్తిస్తుందని వెల్లడించారు. కాగా సింగరేణి అధికారులకు ఏటా చెల్లించే పీఆర్సీకి ఆమోదం తెలపాలని బొగ్గు గని అధికారుల సంఘం (సీఎంవోఏఐ) అధ్యక్ష, కార్యదర్శులు జక్కం రమేశ్, రాజశేఖర్రావు కోరారు. శుక్రవారం సీఎం పర్సనల్ సెక్రటరీ నర్సింగరావుకు వినతి పత్రం అందజేశారు.