గజ్వేల్ అర్బన్, మార్చి 18: అనుమతులు లేకుండా భవన నిర్మాణానికి లోతైన గుంతలు తీయడంతో పక్కనే ఉన్న రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంతోష్ థియేటర్ సమీపంలో గురువారం చోటుచేసుకున్నది. పట్టణానికి చెందిన అయిల కృష్ణ 2011లో పంచాయతీ అనుమతులతో రెండంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. దాని పక్కనే ఉన్న పాత భవనాన్ని పీ రవీందర్రెడ్డి అనే వ్యక్తి తొలగించి నూతన భవన నిర్మాణానికి పునాదుల కోసం లోతుగా మట్టి తవ్వారు.
ఈ క్రమంలో కృష్ణ భవనానికి ఆనుకుని ఉన్న మట్టిని పూర్తిగా తొలగించారు. గుంతలు లోతుగా తీయడం.. మురుగు కాల్వలకు దగ్గరగా ఉండటంతో మురుగు నీరు చేరి భూమి కుంగిపోయింది. దీంతో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. భవనంపై ఉన్న సెల్టవర్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్పై పడటంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి కొద్దిసేపటికి ముందే ఆ భవనంలోని బోర్వెల్ కార్మికులు బయటకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. కాగా, యాదగిరి అనే వ్యక్తి మాత్రం అందులో చిక్కుకుపోవడంతో గాయాల య్యాయి. ప్రమాదానికి కారణమైన రవీందర్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.