వివిధ ప్రాంతాల్లో సోదాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): గంజాయి అమ్మకాలు, వినియోగం, సరఫరాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆదివారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 3.8 కిలోల గంజాయి పట్టుబడింది. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి మెట్రోస్టేషన్ సమీపంలోని వీరా అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించడంతో 2.5 కిలోల గంజాయి లభించింది. గొట్ట వంశీకృష్ణ, కల్లోజు దీప్, వైజ సిద్ధార్థ్, బాసరాజు నరేంద్ర.. ఫ్లాట్లో గంజాయి దందా చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఇందులో ఇద్దరు పట్టుబడగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీళ్లతో సంబంధమున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లో బైండోవర్ చేశారు. ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ సమీపంలో, టీకేఆర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొన్నారు.