అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,974 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. కొత్తగా 3,290 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,708 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో 1,05,024 మందికి కరోనా పరీక్షలు చేయగా.. తాజా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 17 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,40,096కు పెరిగింది. ఇందులో 19,02,256 మంది కోలుకున్నారు. కరోనాతో 13,132 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసుల్లో అత్యధికంగా తూ.గో. జిల్లాలో 577, చిత్తూరులో 501, ప్రకాశంలో 349, కృష్ణాలో 311 కేసులు రికార్డయ్యాయి. ఇదిలా ఉండగా.. ఏపీలో 1.86కోట్ల కొవిడ్ టీకా మోతాదులు పంపిణీ చేయగా.. ఇందులో మహిళలకు కోటికిపైగా డోసులు అందించినట్లు వివరించింది.