ఎలాంటి తెలంగాణ.. ఎలా మారిపోయింది? ఎట్లా నీరసించి పోయిన సమాజం.. ఇంత శక్తిమంతమెట్లా అయింది? మీవన్నీ వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్టులు.. ఎప్పటికీ పూర్తికావన్నవన్నీ ఎట్లా పూర్తయ్యాయి? చుక్క నీరు రాదన్న నేలలో.. చెయ్యి పెడితే అందేన్ని నీళ్లు ఎట్లా వస్తున్నాయి? కాళ్లు, చేతులు వంకర్లు పోయిన చోట.. ప్రాణం ఎట్ల కుదుటపడుతున్నది? ఎవుసం దండుగేనన్నచోట రెండు పంటలు ఎట్లా పండుతున్నయి? భూ పంచాయతీలు బంద్ అయినయి. నేతన్నలు సంబురంగా ఉన్నరు. పవర్ హాలిడేలనుంచి పరిశ్రమలకు విముక్తి లభించింది. లక్షలాది ఆర్తులకు పింఛన్లు అందుతున్నాయి. కులాలు బాగుపడ్డాయి. మతాలు సంతోషంగా ఉన్నాయి. సబ్బండ వర్ణాలు సంబురాల్లో మునిగాయి. కావనుకున్నవన్నీ అయ్యాయి. అవుతున్నాయి. కావన్నవాళ్ల నోర్లు మూతలు పడ్డాయి. ఇది రెండు దశాబ్దాల క్రితం పురుడుపోసుకొన్న టీఆర్ఎస్ రాష్ర్టానికోసం ఉద్యమించి.. రాష్ర్టాన్ని సాధించి.. సాధించిన రాష్ర్టాన్ని ముందుకు తీసుకొనిపోతున్న అద్భుత సందర్భం.
నాకు ఆరెకరాల పొలం ఉన్నది. రెండు బోర్లున్నా నీళ్లు లేక 2014కు ముందు ఎకరా ఎకరన్నరం పొలం వేసేటోన్ని. వర్షాలు లేక చెరువులు, కుంటలు కూడా ఎండిపోయేవి. బోర్లల్లో నీళ్లొచ్చే పరిస్థితి లేకుండే. కూలి పనిచేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేటోన్ని. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో కేఎల్ఐ నీళ్లు రావడంతో మా దశ మారిపోయింది. మిషన్ కాకతీయతో చెరువులు పూడిక తీశారు. వాగు, చెరువులో నీళ్లు వచ్చాయి. ఎండిన రెండు బోర్లు తిరిగి పుంజుకున్నాయి. నాకున్న ఆరెకరాల పొలంలో రెండెకరాలు సాగు చేయడమే కష్టంగా ఉండే. ఇప్పుడు ఇంచు భూమి కూడా వదలకుండా వ్యవసాయం చేస్తున్నా. నాకు ప్రభుత్వం సబ్సిడీ ట్రాక్టర్ ఇచ్చింది. బర్రెల షెడ్డు వచ్చింది. ఉన్న ఊళ్లోనే సంతోషంగా నేను, నా కుటుంబం బతుకుతున్నామంటే అందుకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణం. నాలాంటి వాళ్లు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కుటుంబాలను సాదుకుంటున్నారో లెక్కపెట్టలేం. ఆ మహానుభావునికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
నాడు బీడు భూములు… నేడు బంగారు పంటలు
సాగునీరు లేకుంటే రైతు ఎంత ఆగమవుతాడో.. అదే సాగునీరు అందిస్తే ఆ రైతు బంగారు పంటలు ఎలా పండిస్తాడో.. పక్కనే ఉన్న రెండు చిత్రాలు వర్ణిస్తాయి. 2014లో సాగు నీరు లేక తన పొలం ఎండిపోయిన సందర్భంలో మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన రైతు కృష్ణయ్య దీనంగా తన ఆవేదనను ‘నమస్తే తెలంగాణ’కు వెళ్లబోసుకొన్నాడు.
అదే కృష్ణయ్య ఇప్పుడు సాగు నీరు రావడంతో ఎంత సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాడో తిరిగి ‘నమస్తే తెలంగాణ’కే ఆనందంతో చెప్పి సంబురపడుతున్నాడు. ఈ రెండు చిత్రాల్లో మార్పల్లా సాగునీరు రావడమే. ఆ రైతు ఈ తన సంతోషానికి కారణం తెలంగాణ ఏర్పాటు కావడమేనని.. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే మా జీవితాల్లో మార్పు వచ్చిందని చెబుతున్నాడు.
గిరిజనులకు భగీరథ వరం
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ అంటేనే కష్టాలు.. వానాకాలం.. ఎండాకాలం అన్న తేడాలేదు.. నిత్యం తాగునీటి కష్టాలు.. కలుషిత నీళ్లు తాగి అల్లల్లాడిపోయే గిరిజనులు.. మంచినీటికోసం కిలోమీటర్ల కొద్దీ నడుచుకొంటూ వెళ్లి తెచ్చుకొనేవారు.
తెలంగాణ వచ్చింది.. వాళ్ల నీళ్ల కష్టాలు తీరాయి. ముఖ్యమంత్రి దూరదృష్టితో ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీటి పథకాన్ని అమలుచేయాలన్న సంకల్పం.. మిషన్ భగీరథగా మారింది. ఆదిలాబాద్ గిరిజనులకు ఒక వరంగా పరిణమించింది. ఒక్కొక్కరికి రోజూ వంద లీటర్ల చొప్పున ప్రభుత్వం తాగునీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నది. ఎత్తయిన కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో పైపులైన్లో వేసి ప్రజలకు సురక్షితమైన నీటిని అందిస్తున్నది.
ఆదిలాబాద్లో మిషన్ భగీరథ
గ్రామాలు : 1231
భగీరథ ట్యాంకులు :940
కనెక్షన్లు : 1,50,646
పైపులైన్లు: 1990.9 కి.మీ.
సాగర్ ఆయకట్టు గోస తీరింది
ఉమ్మడి ఏపీలో తెలంగాణలోని పలు జిల్లాల్లో చిన్న సాగునీటి పథకాలు నిర్లక్ష్యానికి గురికావడంతో రైతులు పడ్డ కష్టం అంతాఇంతా కాదు. ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలోని వేంసూరు మండలానికి కేసీఆర్ వచ్చారు.
ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎడుమ కాల్వ ఆయకట్టు పరిధిలోని లిఫ్టులకు విద్యుత్తు బిల్లులు రైతుల నుంచి వసూలు చేస్తున్నారని, కుడి కాల్వ కింద ఆయకట్టు రైతులకు ప్రభుత్వమే చెల్లిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగర్ ఆయకట్టు రైతుల విద్యుత్తు బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఖమ్మం జిల్లాలో 146 లిఫ్టులు ఉంటే.. వాటిలో 90 వరకు ఉమ్మడి రాష్ట్రంలో అసలు పనే చేయలేదు. తెలంగాణ వచ్చాకే వాటికి మరమ్మతులయ్యాయి. ఆయకట్టు స్థిరీకరణ పెరిగింది. పంట ఉత్పత్తులు పెరిగాయి.
కనుమరుగైన ఫ్లోరోసిస్
నల్లగొండ జిల్లాలో ఒళ్లు వంకర్లు తిరిగిన ఫ్లోరోసిస్ బాధితులను తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అనేకసార్లు కండ్ల్లారా చూశారు. ‘సూడు సూడూ నల్లగొండా… గుండె నిండా ఫ్లోరైడ్ బండా’ అంటూ ఫ్లోరోసిస్ కష్టాలపై స్వయంగా పాట రాశారు.
గుక్కెడు నీళ్లు కరువై… అంధకారమైన జీవితాలను చూసి చలించిపోయారు. ‘తెలంగాణ వచ్చిన తర్వాత.. నల్లగొండకు మంచినీళ్లిస్తా’ అనే సందేశాన్ని సైతం తన స్వహస్తాలతో రాశారు. ఇచ్చిన మాటమేరకు స్వరాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు మంచినీళ్లిచ్చి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమితరిమి కొట్టారు. 2015కి పూర్వం తెలంగాణలో రాష్ట్రంలో 967 ఫ్లోరైడ్ ఆవాస ప్రాంతాలున్నట్లుగా పేర్కొంటూ 2020 ఆగస్టు ఒకటి నాటికి తెలంగాణలో వాటి సంఖ్య సున్నాకు చేరుకొన్నట్లు కేంద్రమే స్పష్టం చేసింది. అత్యధిక ఫ్లోరైడ్కు గురైన ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గం నుంచే మిషన్ భగీరథ పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సురక్షిత మంచినీటిని అందిస్తుండటంతో జిల్లాలో ఫ్లోరోసిస్ ప్రభావం క్రమంగా కనుమరుగయింది
మెతుకు సీమలో మెండుగా నీళ్లు
ఒకనాడు మెతుకు సీమ అంటే రైతుల ఆత్మహత్యలు.. నెర్రెలు వారిన, బీడు భూములు, ఎండిన చెరువులు! చుక్కనీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసినా నీటిజాడ కానరాకపోయేది.
స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ నేత సీఎం కేసీఆర్ కావడంతో గలగల పారేటి గోదావరి నీళ్లను బీడు భూములకు మళ్లించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వందల చెరువులు, చెక్డ్యామ్లు నిర్మించి మండుటెండల్లోనూ నింపారు. ఎక్కడో పుట్టిన గంగమ్మను రంగనాయక, మల్లన్నసాగర్ రిజర్వాయర్లను నింపుకొంటూ 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్కు తరలించారు. రైతులకు పంట పెట్టుబడి కింద రైతుబంధు, రైతుబీమాతో భరోసాచ్చింది. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులను నేరుగా జమచేస్తున్నది.
గిరిజనులకు పోడు వరం
ఉమ్మడి రాష్ట్రంలో ఏకాణా పట్టించుకోని గిరిజనులకు కేసీఆర్ పెద్దన్నలా అండగా నిలిచారు. పోడుభూముల సమస్య పరిష్కారం దిశగా తొలి అడుగు వేసింది. దరఖాస్తుల స్వీకారానికి తేదీని కూడా ప్రకటించడంతో లక్షలకొద్దీ అమాయక గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండబోతున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 85 వేల మంది గిరిజన రైతులు 4 లక్షల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తుండగా ఇందులో 1.78 లక్షల ఎకరాలకు ప్రభుత్వం అటవీహక్కుల పత్రాలను అందించింది. మిగిలిన 2.20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు మంజూరు చేయాలని రైతులు దరఖాస్తులు చేసుకొన్నారు. పోడు భూమిని సాగుచేసుకొంటూ ఎటువంటి హక్కులు లేని గిరిజన రైతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారికి భూమి పరంగా హక్కులు కల్పించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నది. భవిష్యత్లో మరోసారి అడవులను నరికి పోడు వ్యవసాయం చేయబోమని హామీ తీసుకుని ఉన్న పోడు భూములకు చట్టపరమైన హక్కులు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
కరీంనగర్కే కాళేశ్వరం తొలి ఫలితం
కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే దక్కింది. ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత వందల కొద్దీ టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి, అన్ని ప్రాంతాలకు తరలించగా, గోదారి గలగలా పారింది.
శ్రీరాజరాజేశ్వర (మిడ్మానేరు) జలాశయం వాటర్ హబ్గా మారింది. వరదకాలువ ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో జీవనదిలా మారింది. లోయర్మానేరు డ్యాం కింద కాకతీయ కాలువ 180 రోజులు నిండుగా పారింది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో సాగు అదనంగా పెరిగింది. భూగర్భ జలం ఏకంగా 6 మీటర్లకు పైగా పైకి చేరింది. వేల చెరువుల్లో పుష్కలమైన మత్స్య సంపద చేతికివచ్చింది. కాళేశ్వర జలాలతో ప్రకృతి పరవశించిపోతున్నది. ఉమ్మడి జిల్లా పర్యాటకంగా మారుతున్నది. మేడిగడ్డ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ దాకా సరికొత్త శోభ సంతరించుకున్నది. వంద కిలోమీటర్ల మేర గోదారి నిండుగా దర్శనమిస్తున్నది. తీరం వెంట పచ్చదనం మైమరపిస్తున్నది.
నేతన్నకు అండగా పెద్దన్న
‘ఆత్మహత్యలు, చావులతో సమస్యలు పరిష్కారం కావు.. నేతన్నా ఊపిరి విడిచి.. కుటుంబాన్ని రోడ్డున పడేయద్దు’ అని సిరిసిల్లలో అప్పటి కలెక్టర్ గోడలపైన రాసిన రాతలను చూసి నాడు కేసీఆర్ చలించిపోయారు.
రూ.3వేల కోట్లతో బతుకమ్మ చీరెలు, రంజాన్, క్రిస్మస్, రాజీవ్ విద్యామిషన్ యూనిఫాంల తయారీ ఆర్డర్లు ఇచ్చి నిరంతరం ఉపాధి చూపించారు. కేసీఆర్ చేయూతతో చేనేత కార్మికుడు నేడు నెలకు రూ.15 నుంచి రూ.20 వేలు సంపాదిస్తున్నాడు. రూ.15.90 కోట్లతో మరమగ్గాల ఆధునీకరణ చేపట్టారు. నేత కార్మికులకు రూ.312 కోట్ల రుణమాఫీ చేశారు. నూలు, రంగులు, రసాయనాలకు రాయితీలు, విద్యుత్తుపై 50% సబ్సిడీ ఇస్తున్నది. నేతన్నలకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు కార్మికులకు యాభై ఏండ్లకే నెలకు రూ.వెయ్యి చొప్పున 3,652 మందికి 3.66 కోట్లు నెలనెలా చెల్లిస్తున్నది. కార్మికులకు కొత్తగా త్రిఫ్ట్ పథకం కూడా అమలు చేస్తున్నది. వర్క్ టు ఓనర్ పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.203.20కోట్లు కేటాయించింది.
భూ పంచాయితీలు బంద్
ధరణి పోర్టల్ వచ్చాక పైరవీ అనే పదం వినిపించడంలేదు. భూ పంచాయితీలు బంద్ అయినయి. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్దకు వెళ్లి చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడా బాధలకు చెక్ పెడుతూ ధరణి వచ్చింది.
రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి 10 నుంచి 15 నిమిషాల్లో పట్టా చేతికిచ్చి పంపుతున్నారు. రైతులకు సులభంగా రిజిస్ట్రేషన్ పట్టాలు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతున్నది. ధరణి ప్రారంభమైన తర్వాత ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే 80వేల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ధరణి సేవలతో సరిహద్దు ప్రాంత ప్రజలకు మరింతగా లాభం చేకూరింది. వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల్లో ఎక్కడికో వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మద్నూర్, జుక్కల్, నిజాంసాగర్, పిట్లం, బోధన్, కోటగిరి, రెంజల్ మండలాల్లోని రైతులు ఇబ్బందులు పడేది. ధరణితో స్థానికంగా తాసిల్ కార్యాలయాల్లోనే భూ బదలాయింపు జరుగుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
తొలిగిన విద్యుత్తు క్షోభ
రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉన్న విద్యుత్తు కోతలు, పవర్ హాలిడేల నుంచి విముక్తి లభించింది. గతంలో పరిస్థితి దారుణంగా ఉండేది. అధికారికంగా 4 గంటలు, అనధికారికంగా మరో ఆరేడుగంటలు కరెంట్ పోయేది.
ఎండాకాలం పవర్ హాలిడే ప్రకటించేవి. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియాలో విద్యుత్తు కోతల సమస్యతో ఐరన్, స్టీల్, ఫార్మా, ఎలక్ట్రికల్ పరిశ్రమలు చాలావరకు మూతపడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో ఔత్సాహికులు జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా రూ.22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో పెట్టిన పెట్టుబడుల్లో అత్యధికంగా టీఎస్-ఐపాస్ ద్వారానే పెట్టుబడులు వచ్చాయి. టీఎస్-ఐపాస్ అమల్లోకి వచ్చిన అనంతరం జిల్లాకు రూ.19,028 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఉచితంగా వైద్య పరీక్షలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ములుగులో ప్రజలకు ఒకనాడు వైద్యం అందడమే కష్టంగా ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాలతో వైద్యసేవలు బాగా మెరుగుపడ్డాయి.
కేసీఆర్ కిట్ల ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు పెరిగి ప్రైవేటు దవాఖానలు వెలవెలబోతున్నాయి. ప్రైవేటు దవాఖానల్లో జరిగే అనవసరపు ఆపరేషన్ల సంఖ్య తగ్గి ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం ఏర్పడింది. కంటి వెలుగు ద్వారా గ్రామాల్లో ఉచితంగా కండ్లద్దాలను అందించడం వృద్ధులకు, మధ్య వయస్సు వారికి ఎంతో దోహదపడింది. టీ డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా 57 వైద్య పరీక్షలు ఉచితంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన రూ.3 కోట్ల నిధులతో ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో టీ డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటుచేశారు.