– సభలు వార్డు ఆఫీసర్లకా? మున్సిపల్ సిబ్బందికా? ప్రజలకా?
– నకిరేకల్ మున్సిపాలిటీలో తీరు మార్చుకోని మున్సిపల్ అధికారులు
నకిరేకల్, జూన్ 08 : గ్రామ, వార్డు స్థాయి నుంచి ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి వేగంగా పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” వార్డు సభల ముఖ్య ఉద్దేశం. కానీ నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోనీ వార్డు సభలలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు మూడు వార్డు సభలు నిర్వహించగా ఒక్క వార్డు సభలో వందమంది ప్రజలు కూడా హాజరు కాకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. మొన్న కడపర్తి రోడ్డులో నిర్వహించిన సభలో 30 మంది కూడా లేకపోవడం, శనివారం మూసి రోడ్డులోని గీత మందిరంలో నిర్వహించిన వార్డు సభలో కేవలం 50 మంది కూడా లేకపోవడం, ఇవాళ సోమవారం నిర్వహించిన జెడ్పీహెచ్ఎస్ లో వార్డు సభలో 30 మంది లేకపోవడం గమనార్హం. ప్రజలతో చర్చించాల్సిన సమస్యల గుర్తింపు, సేవల వికేంద్రీకరణ, అభివృద్ధి పనుల ప్రగతి, పారదర్శకత లాంటి అంశాలను ప్రజలతో కాకుండా, వార్డు సభలకు హాజరైన మున్సిపల్ సిబ్బంది, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో చర్చిస్తారా? అని పలువురు చర్చించుకుంటున్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక (99 రోజుల యాక్షన్ ప్లాన్) లో భాగంగా సోమవారం నకిరేకల్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్లో మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 14, 15, 16 వార్డులకు గాను వార్డు సభలను నిర్వహించారు. ఐదు వార్డులకు కలిపి దాదాపు 4,500 మంది ప్రజలు ఉన్నా ఈ వార్డులలో కనీసం 30 మంది కూడా హాజరు కాకపోవడం ప్రజలకు మున్సిపల్ అధికారులు ప్రచారం నిర్వహించకపోవడమే కారణమని తెలుస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు పది నుండి 15 వాహనాలు ఉన్న 20 వార్డులలో ఏ ఒక్కరోజు వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఒకవేళ వార్డు సభలకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో తరలివస్తే సమస్యల వినుతులు ఎక్కువ అవుతాయని, వాటిని పరిష్కరిస్తామో లేదో అనే సందిగ్ధంలో మున్సిపల్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా నకిరేకల్ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంపై స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ వార్డు సభలలో మళ్లీ మళ్లీ ఇలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయి. మున్సిపల్ అధికారులు తమ తీరును ముందుకు మార్చుకోవడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఈ వార్డు సభలలో వచ్చిన 30 మంది ప్రజల నుండి ఏ ఒక్క వినతి పత్రము తీసుకోకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కమిషనర్ సతీష్ కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ అజ్మీరా కిరణ్, పర్యావరణ ఇంజనీర్ నాగరాజు, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.