సంక్లిష్ట, సంక్షుభిత సమయంలో మట్టి పొరల్లోంచి చరిత్ర గమనాన్ని మలుపుతిప్పే వీరులు పుట్టుకొస్తారు. ఆ సమాజ పురిటినొప్పుల్లోంచి చరిత్ర వీరున్ని కంటుంది. అలాంటి భూమి పుత్రులే ఆ సమాజ గమనాన్ని నిర్దేశించటమే కాదు, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారు. ఆ జాతి కీర్తిపతాకను ఎత్తిపడతారు.
ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ ఒక జాతి జీవన సంస్కృతి ఉన్నతికి నిరంతరం పరితపించేవాడూ, నిబద్ధునిగా నిరంతరం పోరాడేవాడే భూమి పుత్రుడు. దీన్నే సరళంగా ‘సన్ ఆఫ్ ది సాయిల్’గా చెప్పుకొంటాం. అట్లా ప్రపంచంలో నిర్దిష్ట భూ భాగాలకు భూమి పుత్రులుగా పేరుగాంచినవారు ఆధునిక చరిత్రలో ఎందరో ఉన్నారు. మన దేశానికే పరిమితమైతే.. ఈ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షల ప్రతినిధిగా, ప్రతీకగా మహాత్మాగాంధీని చెప్పుకొంటాం. స్వాతంత్య్రోద్యమ కాలంలో కానీ, ఆ తర్వాతకాలంలో భిన్నత్వంలో ఏకత్వంగా సామాజిక సహజీవన గమనంలో గాంధీని మినహాయించి చూడటం అసాధ్యం. మన ప్రాంతం విషయానికి వస్తే.. తెలంగాణ తరతరాల సంస్కృతి ఉన్నతికీ, సమస్త జీవనరంగాల అభ్యున్నతికి పాటు పడుతున్న భూమి పుత్రుడు కేసీఆర్. ఒకరకంగా చెప్పాలంటే.. ఓ చారిత్రక సందర్భంలో తెలంగాణ మట్టి పొరల్లోంచి పుట్టి, చారిత్రక బాధ్యతను తన భుజస్కంధాలపై మోస్తున్నవాడు కేసీఆర్.
ఏడు దశాబ్దాల చరిత్రలో ఎందరో పాలకులను తెలంగాణ చూసింది. గత పాలకులంతా ఎవరికి వారు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతామని చెప్పి అధికారం చేపట్టారు. నిజాయితీతోనూ ప్రజా సంక్షేమం కోసం పథకాలు ప్రవేశ పెట్టినవారూ ఉన్నారు. పేదరిక నిర్మూలన కోసమని అనేక పథకాలు తీసుకువచ్చారు. ఇంటికో బర్రె మొదలుకొని పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. కానీ అవేవీ ఆచరణలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనేది కండ్లముందున్న వాస్తవం. ఇదేదో వ్యక్తుల లోపం కాదు. నీతి, నిజాయితీ ప్రశ్న కాదు. పేర్లు పేర్కొని వ్యక్తులుగా వారిని కించపర్చటం ఉద్దేశం కూడా కాదు. కానీ గత పాలకుల్లో ఎవరూ ఊహించని, ఆలోచించని రీతిలో ఇప్పుడు ఆలోచనలు ఆచరణాత్మకమై అద్భుత విజయాలు ఎలా సాధిస్తున్నాయనేది ఆలోచించాల్సిన విషయం.
గత పాలకుల్లో ఎవరూ తెలంగాణ ఆత్మగా ఎదిగివచ్చినవారు కాకపోవటమే వారి పరిమితి లేదా వైకల్యం. సరిగ్గా ఇక్కడే కేసీఆర్ విశిష్టతను, ప్రత్యేకతను చెప్పుకోవాలి. కేసీఆర్ గత పాలకులకు పూర్తి భిన్నమైనవాడు. తెలంగాణ నేటివిటీ ఉన్నవాడు. అందుకే కేసీఆర్ ప్రతి అడుగులో, మాటలో తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు ప్రతిఫలిస్తాయి. ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతికి వెలుగు బాటలు వేస్తాయి. కేసీఆర్ రూపకల్పన చేసిన ఏ సంక్షేమ అభివృద్ధి పథకమైనా.. దానిలో తెలంగాణ మట్టివాసనలు ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అయినా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అయినా తెలంగాణ మట్టికి జీవం పోసేవి. జవం చేకూర్చేవి. ఉదాహరణకు ఆసరా పింఛన్లు అంటే.. తెలంగాణ పల్లె జీవనంలోని వృద్ధులందరినీ ఆక్కున చేర్చుకోవటం, వారి ఆత్మగౌరవం నిలుపటంగా చూడాలి. ఈ నేపథ్యంలోంచే.. ఇవ్వాళ కేసీఆర్ ఇంటింటికీ పెద్దకొడుకయ్యాడు. రైదుబంధు పథకం అంటే.. కేవలం రైతుకు ఆర్థిక సాయం అందించటం కాదు. మట్టిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడే రైతన్న అప్పులబారిన పడకుండా అండగా నిలువటం. బస్తీ దవాఖానలైనా, కేసీఆర్ కిట్ అయినా తెలంగాణ జనజీవితాలకు తడారని ప్రేమను అందించటం. వారిని కంటిపాపలుగా కాపాడటం. ఓ సంక్షేమ పథకంతో ఎన్ని పైసలు, ఎంతమందికి పథకం అందుతున్నవనేవి.. శుద్ధ యాంత్రిక ప్రశ్నలు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ మానవీయ విలువలు పునాదిగా రూపుదిద్దుకున్నవి. ఎప్పుడైనా ప్రేమానురాగాలను డబ్బు కొలమానంతో తూచటం అసాధ్యం. చాలామంది కేసీఆర్ను వ్యక్తిగా, అతని ఉద్యమ కార్యాచరణలో, రాష్ర్టావతరణ తర్వాత వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటల్లో ఇచ్చిన సందేశాలను రాజకీయ విధానాలుగా, నినాదాలుగా చూస్తున్నారు, లేదా అర్థం చేసుకుంటున్నారు. జయాపజయాలను బేరీజు వేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కేసీఆర్ ఓ వ్యక్తి మాత్రుడు కాదు. తెలంగాణ మట్టి పరిమళానికి ప్రతీక. తరతరాల తెలంగాణ జనజీవన సంఘర్షణ, పురోగమనానికి పతాక.
ఒక రాజకీయపార్టీ ఇరువై ఏండ్లు మనుగడలో ఉండటం గొప్ప విషయం కాకపోవచ్చు. ఇలా దేశంలో అనేక రాష్ర్టాల్లో పలు పార్టీలున్నాయి. కానీ అవన్నీ కొందరి రాజకీయ ఆకాంక్షల పునాదుల్లోంచి ఆవిర్భవించినవి. మనుగడలో కొనసాగుతున్నవి. కానీ ఒక జాతి ఆకాంక్షల కోసం పుట్టి ఉద్యమించి కల సాకారం చేసిన పార్టీగా టీఆర్ఎస్ విశిష్టమైనది. ఉద్యమపార్టీగా, తెలంగాణ అభివృద్ధి ఎజెండాగా అధికారం చేపట్టి సుస్థిర పాలన అందిస్తూ జనరంజక పాలన అందిస్తున్న కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రత్యేకమైనది.
టీఆర్ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా లక్షలాదిగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులంతా మళ్లీ ఒకసారి రాష్ట్రసాధన ఉద్యమస్ఫూర్తిని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అభివృద్ధి, సంక్షేమాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో తెలంగాణ వ్యతిరేకశక్తులు పాగా వేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కావచ్చు కేసీఆర్ ఆ మధ్యన టీఆర్ఎస్ కార్యకర్తలంతా గ్రామాలకు తరలాలని పిలుపునిచ్చారు. గ్రామాలకు తరలండి అనే పిలుపు తెలుగు నేలలో విశిష్ట స్థానమున్నది. ఆ నినాదం వెలుగులోనే తెలంగాణ ఉద్యమాల ఖిల్లా అయ్యింది. తిరిగి నేడు కేసీఆర్ అదే నినాదం ఇవ్వటాన్ని నేటి సామాజిక అవసరంగా టీఆర్ఎస్ శ్రేణులన్నీ గుర్తించాలి.
ప్రతి ఇంటి గడప తట్టి గులాబీ జెండా తెలంగాణ గుండె ధైర్యం ఎలాగో అవగాహన కల్పించాలి. తెలంగాణ వ్యతిరేకశక్తుల ఆటలకు కళ్లెం వేయాలి. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి ఏకైక లక్ష్యంగా ముందుకుపోతున్న టీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వానికీ, ఆత్మగౌరవానికీ ప్రతీకగా నిలుపాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు)
ఒక రాజకీయపార్టీ ఇరువై ఏండ్లు మనుగడలో ఉండటం గొప్ప విషయం కాకపోవచ్చు. ఇలా దేశంలో అనేక రాష్ర్టాల్లో పలు పార్టీలున్నాయి. కానీ అవన్నీ కొందరి రాజకీయ ఆకాంక్షల పునాదుల్లోంచి ఆవిర్భవించినవి. మనుగడలో కొనసాగుతున్నవి. కానీ ఒక జాతి ఆకాంక్షల కోసం పుట్టి ఉద్యమించి కల సాకారం చేసిన పార్టీగా టీఆర్ఎస్ విశిష్టమైనది.
గోసుల శ్రీనివాస్యాదవ్
98492 90606