హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ)/ మాదాపూర్: తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. ప్లీనరీని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం మాదాపూర్ హెటెక్స్లో జరిగే ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఆరు వేల మంది ప్రతినిధులను ఆహ్వానించారు. పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్లీనరీకి చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. అందరూ గులాబీ రంగు దుస్తులు, మహిళలైతే గులాబీ రంగుచీర ధరించి రావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ఇప్పటికే సూచించారు. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరం మొత్తం జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, స్వాగత తోరణాలతో గులాబీమయమైంది. ఈ ప్లీనరీలో ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ప్రతినిధులకు పసందైన విందు ఏర్పాటు చేశారు. ప్లీనరీ ఏర్పాట్లను మంత్రులు, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీలు సంతోష్కుమార్, రంజిత్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఆదివారం పరిశీలించారు.
వేదికపై ఉండేది వీరే..
పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగే ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసీనులు కానున్నారు. వీరందరికీ సౌకర్యంగా ఉండేలా సభా వేదికను విశాలంగా సిద్ధం చేశారు. వేదికపై అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటుచేశారు. కాకతీయ కళా తోరణం, హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి, ద్విదశాబ్ది ఉత్సవాల లోగో, తెలంగాణ తల్లి, సీఎం కేసీఆర్ బొమ్మలతో అలంకరించారు. వేదికపై సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఎగరవేస్తారు. ప్లీనరీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ హైటెక్స్ ప్రాంగణంలో భారీ కాకతీయ కళాతోరణం, దాని ముందు కాళేశ్వరం ప్రాజెక్టు మోడల్ను ఏర్పాటుచేశారు.
ప్రతినిధుల నమోదుకు జిల్లాకో కౌంటర్
ప్లీనరీలో ప్రతినిధుల నమోదుకు ప్రతి జిల్లాకు ఒక కౌంటర్ చొప్పున 33 కౌంటర్లను ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణంలోకి ప్రతినిధులు త్వరగా ప్రవేశించేలా వలంటీర్లు సహకరిస్తారు. పాస్లు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తారు. సభలో ప్రతినిధులకు సహాయం అందించడానికి వలంటీర్లు ఉంటారు. ప్రతినిధులకు ప్రత్యేకంగా కిట్ను అందించనున్నారు. ప్లీనరీకి 25 దేశాల నుంచి పార్టీ ఎన్నారై శాఖల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.
పార్కింగ్కు గూగుల్ మ్యాప్ లొకేషన్
ప్రతినిధులు ప్లీనరీకి చేరుకోవడానికి హైటెక్ ఏర్పాట్లుచేశారు. ఎవరు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడ వాహనాలను పార్క్ చేయాలనే దానిపై గందరగోళం లేకుండా రూట్ మ్యాప్ గూగుల్ లొకేషన్ను షేర్ చేశారు. నియోజకవర్గ ప్రతినిధులకు పార్కింగ్కు కేటాయించిన స్థలాన్ని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు గూగుల్ లొకేషన్ మ్యాప్ను షేర్చేశారు. వాహనాల కోసం 10 పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. 5,500 వాహనాలు పార్కింగ్ చేసేలా హైటెక్స్కు అన్ని వైపులా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. సభ వెనకాల 48 నియోజకవర్గాలకు పార్కింగ్ స్థలం కేటాయించారు. హైటెక్స్లోని 30 ఎకరాల జయభేరి స్థలంలో పార్కింగ్ను ఏర్పాటుచేశారు. ప్రతి పార్కింగ్ స్థలం వద్ద అక్కడ ఉండే డ్రైవర్లు, గన్మెన్, ప్రజాప్రతినిధుల సహాయకుల కోసం ఎల్ఈడీ స్క్రీన్లు, భోజనం, మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్లీనరీ పార్కింగ్ మార్గాన్ని చూపుతూ సైన్ బోర్డులను పెట్టారు. ఆవరణలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ముఖ్యుల వాహనాలను అనుమతిస్తారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ సంతోష్
ప్లీనరీ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఆదివారం పరిశీలించారు. 20 ఏండ్ల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో గర్వించదగ్గ క్షణాలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు, నాయకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, విప్ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నోరూరించే వంటలు
ప్లీనరీలో ప్రతినిధులకు పసందైన భోజనం వడ్డించనున్నారు. ఇందుకోసం 33 రకాల వంటకాలను సిద్ధం చేశారు. వీటిలో శాఖాహారం, మాంసాహారం వంటలున్నాయి. తెలంగాణ ప్రత్యేకతలను తెలిపే వంటకాలు, స్వీట్లు సిద్ధం చేశారు. 15 వేల మందికి సరిపడేలా భోజన ఏర్పాట్లు చేశారు. హైటెక్స్లోని మూడు హాల్స్లో ప్రతినిధులకు భోజనం వడ్డిస్తారు. మహిళలకు ప్రత్యేకంగా భోజన వసతి ఉంటుంది. ధమ్ చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, ఎగ్ మసాలా, నల్ల పొడి ఫ్రై, మటన్ దాల్చా, బోటి ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు, రుమాల్ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, మిర్చి కా సాలన్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారు, పెరుగు, పెరుగు చట్నీ, జిలేబీ, డబల్ కా మీఠా, ఐస్క్రీం తదితరాలు వడ్డించనున్నారు.