జెనీవా: ఆఫ్రికా దేశం గినియాలో మార్బర్గ్ వ్యాధి ( Marburg Disease ) కేసు నమోదు అయ్యింది. ఎబోలా, కోవిడ్19 లాంటి వైరస్ల తరహాలోనే మార్బర్గ్ కూడా ప్రాణాంతమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకి ఉంటుందని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. గబ్బిలా నుంచి సంక్రమించే ఈ వ్యాధి వల్ల మరణాల శాతం 88 ఉంటుందని భావిస్తున్నారు. గుకిడెవో రాష్ట్రంలో ఆగస్టు 2వ తేదీన చనిపోయిన ఓ పేషెంట్ నుంచి తీసుకున్న శ్యాంపిళ్ల ద్వారా ఈ విషయాన్ని ద్రువీకరించారు.
మార్బర్గ్ వైరస్ గురించి జెనీవాలో మాట్లాడిన డబ్ల్యూహెచ్వో.. ఆ వైరస్ జాతీయ, ప్రాంతీయ స్థాయిలో మాత్రమే విస్తరిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశాలు లేవన్నది. గుహలు, గనుల్లోకి వెళ్లడం వల్ల మార్బర్గ్ వైరస్ గబ్బిలాల నుంచి సోకే ప్రమాదం ఉంది. సియర్రా లియోన్, లిబేరియా బోర్డర్ వద్ద ఉన్న ఓ గ్రామంలో మార్బర్గ్ కేసు నమోదు అయ్యింది. తొలుత ఆ పేషెంట్కు మలేరియా పరీక్ష నిర్వహించారు. కానీ ఆ తర్వాత అది మార్బర్గ్ అని తేల్చారు.
పోస్టుమార్టమ్ పరీక్షల్లో ఎబోలా నెగటివ్, మార్బర్గ్ పాజిటివ్ వచ్చింది. గతంలో మార్బర్గ్ కేసులు దక్షిణ కొరియా, అంగోలా, కెన్యా, ఉగాండా, కాంగో దేశాల్లో నమోదు అయ్యాయి. కానీ వెస్ట్ ఆఫ్రికా దేశంలో నమోదు కావడం ఇదే తొలిసారి. మార్బర్గ్ వ్యాధి సోకిన వారిలో ఒక్కసారిగా అధిక జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. శరీరం ఏ పని చేయడానికి సహకరించదు. గతంలో ఈ వ్యాధి ప్రబలినప్పుడు.. మరణాల రేటు 24 నుంచి 88 శాతానికి పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాధి నియంత్రణకు ఎటువంటి టీకాలు కానీ యాంటీ వైరల్ చికిత్సలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.