హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): అతడు ఓ బ్యాంకులో ఉన్నతోద్యోగి.. అక్రమంగా సంపాదించాలన్న ఆశతో సైబర్ నేరాలు చేయాలని కుట్ర పన్నాడు.. బ్యాంకు క్రెడిట్కార్డు ఖాతాదారుల డాటాను బంధువులకు అందించి కోట్లు నొక్కేశాడు. అంతేకాదండోయ్.. ఈ డబ్బు కాజేసేందుకు ఏకంగా బ్యాంకు కాల్సెంటర్ నంబర్నే వాడుకొన్నాడు. రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్(ఆర్బీఎల్) బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న భాటియా.. తన బంధువులతో కలిసి ఓ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశాడు. వారికి కొత్త క్రెడిట్కార్డు ఖాతాదారుల సమాచారం ఇచ్చి సైబర్ నేరాలకు ప్లాన్ వేశాడు.
అమాయకులను బోల్తా కొట్టించి దేశవ్యాప్తంగా 114 నేరాలకు పాల్పడ్డాడు. ఒక్క సైబరాబాద్లోనే 34 మందిని మోసం చేసి, రూ.3 కోట్లు కాజేశాడు. ఓ బాధితుడికి ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు సపోర్ట్ నంబర్ (+9102262327777) నుంచే కాల్ వచ్చింది. నిజమైన నంబరే కదా అని వాళ్లు అడిగిన వివరాలు చెప్పటంతో అతడి క్రెడిట్ కార్డు నుంచి రూ.97,996 నగదు కట్ అయ్యింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం దాదాపు 4 నెలలు కష్టపడి ఢిల్లీ, ఉజ్జయిని ప్రాంతాల్లో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న భాటియా బంధువులు దీపక్, విశాల్ కుమార్తోపాటు మరో 14 మందిని అరెస్టు చేశారు.
వారి నుంచి 865 ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, 1000 సిమ్ కార్డులు, 3 ఖరీదైన కార్లు, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. వీరి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.15 లక్షల నగదు ఫ్రీజ్ చేశారు. బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మీడియాతో మాట్లాడిన సీపీ స్టీఫెన్ రవీంద్ర.. భాటియా పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. అతడి వివరాలను ఆర్బీఎల్ బ్యాంకు అధికారులకు అందించినట్టు వెల్లడించారు. సైబర్ ముఠాను పట్టుకొన్న సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైం డీసీపీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
చాలా తెలివిగా స్పూఫింగ్ అప్లికేషన్ల ద్వారా ఫోన్లు చేసి ఎంతోమందిని బురిడీ కొట్టించారు. ఖాతాదారులను నమ్మించేందుకు ఏకంగా ఆర్బీఎల్ బ్యాంకు టోల్ఫ్రీ నంబర్ను సంస్థకు తెలియకుండానే వాడుకొన్నారు. ఇందుకు mosip, silver dialer అప్లికేషన్ల ద్వారా స్పూఫింగ్ కాల్స్ చేసి మోసాలకు పాల్పడ్డారు. అంతేకాదు.. 865 ఆధార్ కార్డులతో వెయ్యి సిమ్కార్డులను కొనుగోలు చేశారు.
నగదును కొట్టేసేందుకు వీళ్లు సొంతంగా మర్చంట్ వెబ్సైట్లను రూపొందించుకున్నారు. దీనికి వారి సొంత ఖాతాలను అనుసంధానం చేసుకొన్నారు. క్రెడిట్ కార్డు నుంచి నగదును కాజేసే సమయంలో సొంత మర్చంట్ వెబ్సైట్లో షాపింగ్ చేస్తారు. ఆ నగదు నేరుగా వారి ఖాతాల్లోనే పడిపోతుంది. తర్వాత తాపీగా నగదును పంచుకొంటారు. ఇలా భాటియా సూచనలతో దీపక్, విశాల్ ఓ పకడ్బందీ సెటప్ను ఏర్పాటు చేసుకొన్నారు. మర్చంట్ వెబ్సైట్లను రూపొందించిన వ్యక్తిని కూడా సైబరాబాద్ పోలీసులు బీహార్లో అదుపులోకి తీసుకొన్నారు.
భాటియా తన బంధువులు దీపక్, విశాల్ కుమార్తో ఓ కాల్ సెంటర్ను ఢిల్లీ ఉత్తమ్నగర్లో తెరిపించాడు. ఆర్బీఎల్ బ్యాంకులో జారీ అయ్యే క్రెడిట్ కార్డుల డాటాను వారికి ఇచ్చేవాడు. కొంతమందిని ఉద్యోగులుగా నియమించుకొన్న దీపక్, విశాల్.. ఖాతాదారుడి నుంచి కొల్లగొట్టిన నగదు మీద 10 శాతం కమీషన్ ఉద్యోగులకు ఇచ్చేవారు. వాళ్లు ముందుగా.. ఖాతాదారులకు ఫోన్ చేసి మీకు కొత్త క్రెడిట్ కార్డు వచ్చిందా, యాక్టివేట్ అయ్యిందా అని పలుకరిస్తారు. యాక్టివేట్ కాలేదు, పిన్ నంబర్ రాలేదని చెప్పగానే మీ పాన్కార్డు, క్రెడిట్ కార్డు చివరి 4 అంకెలను చెప్పండని తీసుకొంటారు. ఓటీపీ రాగానే చెప్తే యాక్టివేట్ అవుతుందని చెప్పి, లావాదేవీలు జరిపి క్రెడిట్ కార్డులో నగదును దోచేస్తారు. అప్పటికే కార్డు యాక్టివేట్ అయ్యిందని చెప్తే.. అనవసర ఇన్సూరెన్స్ నగదు పడిందని, దాన్ని తీసేస్తామని ఓటీపీ అడిగి బురిడీ కొట్టిస్తారు.