సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): అడిగిన వెంటనే ఓటీపీలు చెప్పేలా చేసి.. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు. గతేడాదిగా 33 వేల మందికి ఫోన్ కాల్స్ చేసి..ఖాతాలు ఖాళీ చేసిన ఈ గ్యాంగ్ ప్రధాన నిందితుడితో పాటు మరో 13 మందిని ఢిల్లీలో అరెస్టు చేశారు. అక్కడి కాల్ సెంటర్ను జప్తు చేశారు.
సాంకేతిక ఆధారాలతో…
గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం..అక్టోబర్ 2న ఒకరికి ఫోన్ చేసి..‘ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు కొత్త క్రెడిట్ కార్డులను ఇస్తున్నాం ..పాతవి గడువు తీరిపోతుంద’ని చెప్పారు. ఓటీపీ తెలుసుకొని.. కొత్త కార్డులు యాక్టివేషన్ అవుతుందంటూ…ఖాతాల నుంచి రూ. 1.64 లక్షలు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు స్ఫూఫింగ్ అప్లికేషన్స్ ద్వారా ఎస్బీఐ కస్టమర్ కేర్ నంబరుతోనే అందరికీ ఫోన్లు చేసి.. మోసం చేస్తున్నట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో ఈ మోసానికి పాల్పడుతున్న కాల్ సెంటర్ ఢిల్లీలో ఉత్తమ్నగర్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు నిఖిల్ మదాన్తో పాటు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కాల్ సెంటర్లో పని చేసిన మహిళలు కూడా ఉన్నారు.
ఆ యాప్తో అలా…
మోసాలతో డబ్బులు సంపాదించేందుకు ఢిల్లీకి చెందిన నిఖిల్ మదాన్ తన అనుచరులతో కలిసి ఢిల్లీ ఉత్తమ్నగర్లో ఓ కాల్సెంటర్ను ఏర్పాటు చేశాడు. గతంలో పలు బ్యాంకుల్లో పని చేసిన అనుభవంతో కొన్ని లోపాలను గుర్తించి..మోసాలకు తెరతీశాడు. ఏజెంట్ల ద్వారా క్రెడిట్ కార్డు ఖాతాదారుల సమాచారాన్ని తెలుసుకొని.. దోచుకుంటున్నాడు. బీహార్కు చెందిన ముర్షిద్ ఆలం దగ్గర స్ఫూఫింగ్ యాప్ ఎంవోఎస్ఐపీ, సిల్వర్ డయలర్ను తీసుకున్నాడు. ఆ యాప్లో ఎస్బీఐ కస్టమర్ కేర్ నంబరును పొందుపర్చి.. వాటితో కాల్ సెంటర్లో ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులతో అందరికీ ఫోన్లు చేయించేవాడు. అమాయకులను నమ్మించేందుకు కాల్ సెంటర్ ఉద్యోగులకు ఎలా మాట్లాడాలి.. ఎలా నమ్మించాలనే దానిపై శిక్షణ కూడా ఇప్పించాడు. ఈ క్రమంలో ఆ కాల్ సెంటర్ ఉద్యోగులు ఇప్పటి వరకు 33 వేల ఎస్బీఐ ఖాతాదారులకు ఫోన్లు చేసి.. కోట్లు కొల్లగొట్టారని సమాచారం. సైబరాబాద్లో 14 మందిని మోసం చేయగా, దేశవ్యాప్తంగా 195 కేసులు ఉన్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు.
అక్కడ ఐపీ…
ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఫర్మాన్ హూస్సేన్ దేశవ్యాప్తంగా స్ఫూఫింగ్ అప్లికేషన్స్ను రూపొందించి..అమ్ముతుంటాడు. పోలీసులకు చిక్కకుండా బంగ్లాదేశ్లో ఓ చిరునామా మీద ఐపీ అడ్రస్స్ను సృష్టించాడు. ఈ క్రమంలో ముర్షిద్ ఆలం వద్ద నిఖిల్ మదాన్ ఈ యాప్ను కొనుగోలు చేసి.. దోపిడీ పర్వాన్ని కొనసాగించాడు. స్ఫూఫింగ్ అప్లికేషన్స్ చాలా ప్రమాదకరమని పోలీసులు గుర్తించారు. దీని ద్వారా ఎవరి నంబర్ అయినా రిజిస్టర్ చేసుకుని ఎవరికైనా ఫోన్ చేసే ప్రమాదముందంటున్నారు.