ఒంగోలు: హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో 12 మంది దోషులకు ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో ఏడుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2008లో జాతీయ రహదారిపై వాహనాలు చోరీ, డ్రైవర్ల హత్య వంటి పలు కేసులు ఈ మున్నా గ్యాంగ్పై ఉన్నాయి. ఏడు కేసులకుగాను మూడు కేసుల్లో వీరు దోషులుగా తేలడంతో కోర్టు ఈ మేరకు ప్రధాన నిందితుడు మున్నాతోపాటు మరో 11 మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. చెన్నై-కోల్కతా హైవేపై మహమ్మద్ సమద్ అలియాస్ మున్నాభాయ్ గ్యాంగ్ చేసిన ఘాతుకాలు ఇన్నీ అన్నీ కావు. దోపిడీలు, హత్యలు యథేచ్ఛగా సాగించింది. గత మంగళవారం నిందితులను కోర్టు దోషులుగా ప్రకటించింది. ఇందులో మూడు దోపిడీ, హత్య కేసులు కాగా నాల్గవది ఆయుధాల చట్టం కింద నమోదైన కేసు. మిగతా కేసుల విచారణ కొనసాగుతున్నది.