న్యూఢిల్లీ, మార్చి 6: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు చేస్తున్న నిరసనోద్యమం శనివారంతో వందరోజులు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా అన్నదాతలు తమ నిరసనను మరింత ఉద్ధృతం చేశారు. 100వ రోజును బ్లాక్ డేగా పాటించారు. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమేనని, అయితే ఇందుకు ముందస్తు షరతులు విధించరాదని స్పష్టంచేశారు. తదుపరి కార్యాచరణపై ఈ నెల 9న రైతు నేతలు సమావేశం కానున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. అంతకుముందు, రైతులు నల్లజెండాలు చేతబట్టి హర్యానాకు పశ్చిమాన ఉన్న కుండ్లి-మానెసార్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేను ఐదు గంటల పాటు దిగ్బంధించారు. హైవే మీదకు వచ్చిన కార్లు, లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దిగ్బంధం కొనసాగింది. సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లోని టోల్ ప్లాజాలను ముట్టడించారు. ‘నిరసనోద్యమాన్ని మోదీ ప్రభుత్వం ఇగో ఇష్యూగా మార్చివేసింది. రైతుల బాధలు ప్రభుత్వానికి కనిపించడం లేదు. నిరసన మినహా ప్రభుత్వం మాకు వేరే అవకాశాన్ని మిగల్చలేదు’ అని పంజాబ్కు చెందిన వృద్ధ రైతు అమర్జీత్ సింగ్ అన్నారు. అన్నదాతలను ప్రభుత్వం హింసిస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ట్వీట్ చేశారు.