ఖైరతాబాద్, డిసెంబర్ 29 : ‘తెలంగాణలో వ్యాక్సినేషన్ 100% పూర్తికావడం సంతోషకరమంటూ ఈ మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రతి ఒక్కరిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అభినందించారు. చింతలబస్తీలోని యూపీహెచ్సీ కేంద్రాన్ని డీఎంఅండ్హెచ్వో డాక్టర్ వెంకటితో కలిసి ఆమె సందర్శించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సినేషన్ డ్రైవ్లో పాల్గొంటున్న వైద్యులు, సిబ్బంది, ఆశావర్కర్ల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. అందువల్లనే మొదటి డోసు వంద శాతం, రెండో డోసు 65 శాతం పూర్తయ్యిందని అన్నారు.
బీసీ జనగణనకు సిఫారసు చేయండి: బీసీ సంక్షేమ సంఘం వినతి
బీసీల జనగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు విజ్ఞప్తి చేశారు. బీసీల జనగణనకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. జనవరి 3న నిర్వహించే సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్ను ఆహ్వానించారు. గవర్నర్ను కలిసినవారిలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు మణిమంజరి తదితరులు ఉన్నారు.