న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని సాధించింది. మంగళవారం ఒకే రోజు 1.08కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. రికార్డుస్థాయిలో ఒకే రోజు మొత్తం 1,08,84,899 మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పింది. జనవరిలో టీకా డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 65,03,29,061 మోతాదులు వేసినట్లు పేర్కొంది.
ఇందులో 50,12,44,655 మొదటి మోతాదులు కాగా.. 14,90,84,406 మందికి రెండో మోతాదు వేసినట్లు చెప్పింది. 60 సంవత్సరాలు పైబడిన 13.34 కోట్ల మందికి టీకాలు వేయగా, 45-60 ఏజ్ గ్రూప్లో 19.76 కోట్ల మందికి టీకాలు వేసినట్లు తెలిపింది. 18-44 ఏజ్ గ్రూప్లో ఇప్పటివరకు 31.57 కోట్ల మందికి టీకాలు వేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు ఈ నెల 27న సైతం భారత్లో తొలిసారిగా కోటి డోసులు వేసింది.