సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ ) : మహానగరంలో తెరుచుకుని ఉన్న నాలాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై తెలంగాణ రాష్ట్ర మానవ హకుల కమిషన్ (టీహెచ్ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మియాపూర్ వైశాలీనగర్ రైల్వే బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా ఉన్న వరద నీటి కాల్వ (నాలా)లో పడి 75 ఏళ్ల బాలయ్య అనే వృద్ధుడు కొట్టుకుపోయిన విషాదకర ఘటనపై హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు (హెచ్ఆర్సీ నం. 3111/2026) చేసింది.
‘మృత్యు నాలాలు-ప్రాణాలను మింగేస్తున్న వరద నీటి కాల్వలు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ కథనంపై స్పందించిన హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్తో పాటు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్కు నోటీసులు పంపారు.
నాలా విస్తరణ, పైప్ లైన్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కనీస భద్రతా చర్యలైన బారికేడింగ్, రక్షణ ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో వెలుతురు (లైటింగ్) ఏర్పాటు చేయకపోవడం పట్ల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు రాజ్యాంగం కల్పించిన జీవించే హకును భంగపరిచేలా అధికారుల నిర్లక్ష్యం ఉందనడంలో సందేహం లేదని స్పష్టం చేసింది. వర్షాకాలంలో ప్రతీ ఏటా ఇటువంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నా పౌర భద్రతను గాలికి వదిలేయడంపై కమిషన్ మండిపడింది.
గల్లంతైన వృద్ధుడి కోసం జరుగుతున్న గాలింపు చర్యల పురోగతి, నాలా నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లు, బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలతో పాటు.. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకునే నివారణ చర్యలపై పూర్త వివరాలతో కూడిన నివేదికను ఆగస్టు 25న ఉదయం 11:00 గంటలకు తమ ముందు ప్రవేశపెట్టాలని హెచ్ఆర్సీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.