నవాబ్పేట, డిసెంబర్ 16 : జిల్లా వ్యవసాయ సహకార సంఘం (డీసీసీబీ) నుంచి విద్య, గృహరుణాలు అందజేయనున్నట్లు ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి టి.లక్ష్మయ్య తెలిపారు. మండలకేంద్రంలోని సింగిల్విండో కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతోపాటు రుణాల రికవరీపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో సీఈవో లక్ష్మయ్య మాట్లాడా రు. జిల్లా సహకార సంఘంతోపాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని సంఘాలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండునెలల నుంచి సహకార కేంద్ర బ్యాంకు నుంచి రైతు పిల్లలకు విద్యారుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు.
అలాగే వ చ్చే జనవరి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకునే రైతులకు గృహ రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు. సహకార కేంద్ర బ్యాంకు 2021-22 ఆర్థిక సంవత్సరం రుణాలపై రూ.12కోట్ల ఆదాయం పొందినట్లు వివరించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.111కోట్ల రుణ బకాయిలు ఉండగా, నవంబర్ నాటికి రూ.57కోట్లకు తగ్గించామని పేర్కొన్నారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకుగానూ ఓటీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలోని యన్మన్గండ్ల సొసైటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. ఓటీఎస్ పద్ధతితో రుణాలు రికవరీ చేసే సంఘాలకు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, ఆర్పీలు అశోక్కుమార్, ప్రశాంత్భూషన్రెడ్డి, సింగిల్విండో సీసీవో హన్మంతు తదితరులు ఉన్నారు.