హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రిజర్వేషన్ల పరిమితిపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే వదిలేయాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలిసింది. విద్య, ఉద్యోగరంగాల్లో వివిధ వర్గాలకు సామాజిక, ఆర్థిక అంశాల ప్రాతిపదికన కల్పించే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని 1992లో ఇందిరాసాహ్ని కేసులో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరనున్నట్టు సమాచారం. దేశంలోని వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు సామాజిక పరిస్థితులు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన జనాభా, మరికొన్ని రాష్ట్రాల్లో ఓబీసీ జనాభా 50 శాతానికి మించి ఉన్నది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు శిలాశాసనం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. భిన్న వర్గాల జనాభా పెరుగుదలలో వ్యత్యాసాల కారణంగా కాలానుగుణంగా సామాజిక స్థితిగతులు మారాయి. రాజ్యాంగంలో రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితికి సంబంధించి ఎలాంటి నిబంధన లేదు. రిజర్వేషన్కు అర్హత ఉన్న కులాలను కాలానుగుణంగా ఓబీసీ జాబితాలో చేర్చి, రిజర్వేషన్లను 50 శాతంకంటే ఎక్కువ పెంచుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలను 102వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం లాగేసుకొన్నది. ఈ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్ 342(ఏ) వల్ల రాష్ర్టాలు అధికారాలు కోల్పోయాయి. దాంతో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు సమాచారం.