హైదరాబాద్, మే 2(నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాక్సిన్లపై పరిశోధనలు, సామర్థ్యంపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ గురువారం స్పందించింది. ‘సేఫ్టీ ఫస్ట్’ (రక్షణకే తొలి ప్రాధాన్యం) అనే నినాదంతో తాము కొవాగ్జిన్ను తయారు చేశామని తెలిపింది. సామర్థ్యాన్ని రెండో ప్రాధాన్య అంశంగా ఎంచుకున్నామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం’ కింద తయారై, దేశంలో అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్న ఏకైక వ్యాక్సిన్ కొవాగ్జిన్ అని పేర్కొన్నది. లైసెన్స్ పొందే క్రమంలో 27 వేల పరీక్షలను ఎదుర్కొన్నట్టు చెప్పింది. వేలాది మందిపై క్లినికల్ ట్రయల్స్ను అత్యంత పకడ్బందీగా నిర్వహించామని, కేంద్ర వైద్యారోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షించిందని తెలిపింది. అందుకే ఇప్పటివరకు కొవాగ్జిన్కు సంబంధించి ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని, రక్తం గడ్డ కట్టడం, త్రాంబోసైటోపెనియా, టీటీఎస్, వీఐటీటీ, పెరికార్డియాటిక్స్ వంటివి నమోదు కాలేదని చెప్పింది.