జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మళ్లీ ది కశ్మీర్ ఫైల్స్ సినిమా విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఆ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ప్రస్తావించారు. ఓ ముస్లిం హిందువును చంపేసి, ఆ రక్తం కలిసిన బియ్యాన్ని తినిపిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇంతలా దిగజారిపోయామా? అంటూ ప్రశ్నించారు.
ఎలాంటి ఆధారాలు లేకుండానే కశ్మీర్ ఫైల్స్ను తెరకెక్కించారని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. కేవలం ద్వేషం ఆధారంగా నిర్మించారన్నారు. పిల్లల్లో కూడా ఈ సినిమా విష బీజాలనే నింపుతోందని ఫరూక్ పేర్కొన్నారు. మరోవైపు ఫరూక్ సోమవారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్తో భేటీ అయ్యారు. పలు విషయాలు గవర్నర్తో చర్చించామని ఆయన వెల్లడించారు.
తాము ఎవ్వరి విషయంలోనూ రాజకీయాలు చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. కేవలం సానుభూతి మాత్రమే తెలుపుతున్నామని అన్నారు. సానుభూతిని కూడా కొందరు తొక్కేస్తున్నారని కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇలా చేస్తే.. సమాజంలో కలివిడిగా ఎలా వుండగలం? అంటూ ఫరూక్ అబ్లుల్లా ప్రశ్నించారు.