మహమ్మారి ప్రబలిన గత రెండేళ్లలో మనం చాలా నవ్వుల్ని కోల్పోయాం. ఆ నవ్వులన్నీ మా సినిమాతో తిరిగొస్తాయి అంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నది. కిషోర్ తిరుమల దర్శకుడు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ…‘కొద్ది విరామం తర్వాత నేను నటించిన ఓ మంచి కుటుంబ కథా చిత్రమిది. నటిస్తున్నప్పుడు ప్రతి రోజూ సంతోషపడ్డాను. రాధిక, ఖుష్బూ లాంటి సీనియర్ నటీమణులతో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. రష్మిక అంకితభావం ఉన్న నటి. ఎక్కడో ‘పుష్ప’ షూటింగ్ లో పాల్గొంటూ మళ్లీ ఇక్కడ షూటింగ్కు వచ్చేది. తిరుమల కిషోర్ తో మళ్లీ సినిమాలు చేయాలని ఉంది. నేను నటిస్తున్నట్లు కూడా ఎక్కడా అనిపించలేదు. అలా గతంలో మారుతి, మేర్లపాక గాంధీ లాంటి దర్శకులతో సులువుగా పనిచేశాను. సినిమా చూశాక ఆనందంతో బయటకొస్తారు. ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి కలుగుతుంది’ అన్నారు. ‘సినిమా కథ విన్నప్పుడు, నటిస్తున్నప్పుడు, డబ్బింగ్ కోసం తెరపై చూసుకుంటున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. కరోనా టైమ్లో మన జీవితాలు నాటకీయంగా మారిపోయాయి. ఆ ఒత్తిడి మా సినిమాను చూస్తే మర్చిపోతారు’ అని రష్మిక మందన్న చెప్పారు. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ..‘మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలి అనే కోరికతో ఈ సినిమాను రూపొందించాము. మీ కుటుంబంలోని ఆడవాళ్లందరితో కలిసి సినిమాకు రండి. అంతా కలిసి నవ్వుకుంటారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటి రాధిక, ఖుష్బు, నిర్మాత సుధాకర్ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు.