‘అంతర్జాతీయ రంగంలో వేగంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో భారత్ మాకు ప్రధానమైన భాగస్వామి. మా ఇండో పసిఫిక్ విధానానికి భారత్తో రక్షణ భాగస్వామ్యం ఇరుసుగా ఉంటుంది’- ఇటీవల మనదేశం సందర్శించిన అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ చెప్పిన మాటలివి. అమెరికా కొత్త అధ్యక్షుడిగా బైడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆస్టిన్ ఆసియా పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆస్టిన్ న్యూఢిల్లీకి రావడానికి ముందు జపాన్, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించారు. హవాయి దీవుల్లోని ఇండో పసిఫిక్ సైనిక స్థావరాన్ని కూడా సందర్శించారు. ఆతరువాత ఢిల్లీకి చేరుకొని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చలు జరిపారు. ఆస్టిన్ పర్యటన రెండు దేశాల మధ్య గల కొద్దిపాటి విభేదాలను తొలగించి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందనవచ్చు.
అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా భారత్తో సంబంధాలు చెక్కుచెదిరే పరిస్థితి లేదు. రెండు దేశాల సంబంధాలు క్రమంగా బలపడుతూనే ఉన్నాయి. కానీ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మిత్రదేశాల పట్ల నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించారు. నాటో కూటమినే నిర్వీర్యం చేయ తలపెట్టారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పాత ఒప్పందాన్ని కాలరాచారు. భారత్తో వాణిజ్య వివాదం రగిలించారు. శత్రు, మిత్ర దేశాలనే తేడా లేకుండా అంగట్లో వ్యాపారస్థుడిలా వ్యవహరించారు. పశ్చిమాసియాతో పాటు పలు చోట్ల వైషమ్యాలు పెంచారు. ఈ నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టగానే మళ్ళీ పాత సంబంధాలను పునరుద్ధరిస్తున్నారు. సౌదీ అరేబియా యువరాజు సల్మాన్ ఉన్మాద పోకడకు అడ్డుకట్ట వేశారు. పలు చోట్ల ఉద్రిక్తతలు సడలడం ఇప్పటికే మొదలైంది. ప్రజాస్వామ్య శక్తులకు మద్దతు లభిస్తున్నది.
భారత్ అవసరాలు వివిధ రంగాలకు సంబంధించినవి, భిన్నమైనవి. వాణిజ్యరంగంలో, వాతావరణ మార్పు అరికట్టే చర్యల విషయంలో భారత్ వైఖరి అమెరికాకు భిన్నమైనది. రష్యా నుంచి రక్షణ కొనుగోళ్ల విషయంలో కూడా ఆంక్షలు విధించకూడదు. భారత్ పరిస్థితిని అమెరికా అర్థం చేసుకోవాలి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ను దిగ్బంధం చేయాలని చైనా ప్రయత్నిస్తున్నది. పాకిస్థాన్, మయన్మార్, శ్రీలంక దేశాలలోని రేవులను గుప్పెట్లో పెట్టుకుంటున్నది. మరోవైపు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేయాలని అమెరికా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో భారత్- అమెరికా మైత్రి ఉభయతారకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా, జపాన్తో కలిసి భారత్, అమెరికా చతుర్భుజ కూటమిగా ఏర్పడుతున్నాయి. ఆస్టిన్ పర్యటన సందర్బంగా ఈ కూటమిపై చర్చ ప్రధానాంశంగా ఉన్నది. అయితే బైడెన్ చైనా పట్ల ఘర్షణ వైఖరి ప్రదర్శించకపోవచ్చు. ఈ నేపథ్యంలో తన ప్రయోజనాల పరిరక్షణకు పూర్తిగా అమెరికాపై ఆధారపడకుండా భారత్ సొంత వ్యూహాన్ని రూపొందించుకోవాలి.