పుస్తకాలు చదవడం చాలామందికి ఓ వ్యాపకం. ఇదో మంచి అలవాటు కూడా. అయితే పుస్తకాలపై ప్రేమ ఉన్నా, వాటిని కొనలేని పరిస్థితి. ముడి సరుకు కొరత, ముద్రణ వ్యయం పెరిగిపోవడం.. తదితర కారణాల వల్ల పుస్తకం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆర్థిక పరిమితుల వల్ల పఠనానికి దూరం అవుతున్నవారి కోసం గురుగ్రామ్కు చెందిన 26 ఏండ్ల రితికా శ్రీవాస్తవ్ ‘బుక్ తేలా’ పేరుతో ఒక ఆన్లైన్ ప్లాట్ ఫామ్ను స్థాపించింది. ఆ వేదిక ద్వారా తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముతున్నది. ఆమె తండ్రి నీరజ్ శ్రీవాస్తవ నవలా రచయిత. ఆయనే ఈ సలహా ఇచ్చారట. ‘కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే నేను పుస్తకాల వ్యాపారం మొదలుపెట్టాను.
అప్పుడు నా దగ్గర పెద్దగా డబ్బు ఉండేది కాదు. ఉన్న కొద్దిపాటి సొమ్ముతోనే పాత పుస్తకాలు కొనేదాన్ని. మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ పుస్తకాల వ్యాపారం ఒక పద్ధతిగా లేదు. లాభం కోసం చూసుకోకుండా చవకగా అమ్ముతాన్నేను. పుస్తకాల ధర రూ.69 నుంచి రూ.399 మధ్య ఉండేలా చూస్తాను. మా వెబ్ సైట్లో తరచూ కొత్త పుస్తకాలను చేరుస్తున్నాను. కస్టమర్ల కోసం ‘రిక్వెస్ట్ ఎ బుక్’ ఆప్షన్ ప్రారంభించాం. తమకు కావలసిన పుస్తకం గురించి మాకు ముందుగా చెబితే, ఎక్కడున్నా సరే సేకరించి ఇస్తాం. ఇంత తక్కువ సమయంలోనే మా బ్రాండ్కు ఇన్ని ప్రశంసలు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని చెబుతున్నది రితిక.