ఆ శివాలయానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉంది. దక్షిణ కాశీగా పేరు తెచ్చుకున్నది. మూలవిరాట్టు సాక్షాత్తు స్వయంభువు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ సోమేశ్వరస్వామి గుడి.. భక్తుల పాలిట కైలాసపురి. కాశీ క్షేత్రానికి మరో రూపం. స్వామివారి మహిమలు, ఆలయ ప్రశస్తికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
పరమ శివుడు భక్త వత్సలుడు. చిటికెడు విభూతికి పొంగిపోతాడు. చెంబుడు నీళ్లు అభిషేకిస్తే మురిసిపోతాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో కొలువైన సోమేశ్వరుడూ అంతే. ఇక్కడ నిత్యం ఎదుల్లవాగు దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శివాలయానికి ఘన చరిత్రే ఉంది. తేరాల వంశస్తుడు సోమశేఖర గుప్త స్వామికి గుడికట్టారు.
స్వప్నంలో శివదర్శనం
శివయ్యకు భక్తులంటే ప్రేమ. ఒక్క పిలుపు చాలు పరిగెత్తుకొని వస్తాడు. నోరారా నామస్మరణ చాలు ఉబ్బిపోతాడు. వరాలిస్తాడు. మానవాళికి మంచి జరుగుతుందంటే పాషాణాన్నే మింగిన దేవుడు.. తనను కొలిచేవారిని మాత్రం కాచుకోకుండా ఉంటాడా? తేరాల వంశస్తులకు నాలుగు తరాల వరకూ సంతానం లేదు. ఐదో తరం వారసుడే తేరాల సోమశేఖర గుప్త. సుజాతనగర్కు చెందిన గుప్త దంపతులకు చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. ఎన్నో దేవుళ్లకు మొక్కారు. అయినా ప్రయోజనం కనిపించ లేదు. పూజలు, వ్రతాలు చేసినా ఫలితం సిద్ధించలేదు. ఓరోజు దట్టమైన అటవీ ప్రాంతంగుండా వెళ్తూ.. ఓ చోట విశ్రమించారు సోమశేఖర గుప్త. శివుడు కలలో కనిపించి ‘నాకు పందిరి వేస్తే.. నీకు సంతాన భాగ్యం కలుగుతుంది’ అని చెప్పాడట.
అదే ఆజ్ఞగా భావించి పక్కనే ఉన్న వాగు దగ్గర పందిరి వేయించాడు. శివుడి ఆజ్ఞతో ఆ పందిరిలో లింగాకారం వెలసిందని చెబుతారు. అప్పటినుంచీ ధూప దీప నైవేద్యాలతో పూజలు ప్రారంభించారు. సోమశేఖర గుప్తకు సంతానమూ కలిగింది. ఆతర్వాత, పందిరి వేసిన చోట ఆలయ నిర్మాణం చేపట్టారు. అదే ఇప్పుడు స్వయంభూ సోమేశ్వరస్వామి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయం కోసం 30 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి, ఆలయ అభివృధ్దికి కృషి చేశారాయన. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడిని 1965లో దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. స్వామి సేవలో తరించిన బుచ్చయ్య శాస్త్రి వారసులే ఇప్పటికీ అర్చకత్వం నిర్వహిస్తున్నారు.
ఉత్తర వాహినిగా..
సోమేశ్వర స్వామి దేవాలయం ముందు నుంచి ఉత్తర వాహిని అయిన ఎదుళ్ల వాగు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రం కార్తికమాసంలో పుణ్యస్నానాలకు సౌకర్యవంతం. సుదూర ప్రాంతాల నుంచీ భక్తులు తరలివస్తారు. ఇక్కడ స్నానం చేస్తే కాశీలోని గంగలో మునిగినంత పుణ్యమని చెబుతారు. ఆలయ ఆవరణలో పురాతన రావి చెట్టు ఉంది. ‘ఉత్తర వాహిని అయిన తీర్థం ఉండటం వల్ల ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తారు. తరాలుగా శివాలయంలోనే అర్చకులుగా ఉంటున్నాం’ అంటారు ఆలయ అర్చకులు చొప్పకట్ల జనార్దన్ శర్మ. స్వామి మహిమలనూ, భక్తుల కథలనూ అనేకం విన్నామని చెబుతారు. సంతాన భాగ్యం కోసం ఆశ్రయించేవారిని సోమేశ్వరుడు కటాక్షిస్తాడని వివరిస్తారు.