హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): యాసంగి బియ్యం కొనుగోలు చేయాలంటూ రైతుల పేరిట దొంగ దీక్షలు చేయటంలో బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. మొన్నటిదాకా బీజేపీ దొంగ దీక్షకు దిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చిందా? అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద డిసెంబర్ 9 నుంచి 13లోపు ఏదో ఒక రోజున దీక్ష చేయాలని నిర్ణయించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పక్కా రాజకీయ ప్రణాళికతో రైతులను అయోమయానికి గురి చేసేందుకే కాంగ్రెస్ ఈ దీక్ష చేపడుతున్నదని విమర్శలు వస్తున్నాయి. వరి నార్లు పోసే పుణ్యకాలం పూర్తయ్యాక ధర్నా చేసి లాభమేంటనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ మైలేజీ పొందాలనే కుట్ర తప్ప, రైతులకు కలిగే ప్రయోజనం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రైతులు యాసంగి సాగుకు వరి నార్లు పోసే సమయం ఇది. రేవంత్రెడ్డి ధర్నా చేస్తానన్న సమయానికి నార్లు పోసే పుణ్యకాలం దాదాపుగా పూర్తవుతుంది. ఆ సమయంలో కాంగ్రెస్ ధర్నా చేసి లాభం ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి. రైతులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే ముందునుంచే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని, నవంబర్లోనే ఎందుకు ఢిల్లీలో ధర్నాకు పిలుపు ఇవ్వలేదని రేవంత్రెడ్డిని తెలంగాణ రైతాంగం ప్రశ్నిస్తున్నది. ఢిల్లీలో కాంగ్రెస్ చేసే ఒక్కరోజు ధర్నాకు బీజేపీ బెదిరిపోయి యాసంగి ధాన్యాన్ని కొంటుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలుపై వివాదం రెండు, మూడు నెలలుగా సాగుతున్నది. చడీచప్పుడు లేకుండా కూర్చున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రైతుల కోసం తాము తప్ప మరెవరూ పోరాడటం లేదన్నట్టు కటింగ్ ఇవ్వటానికి సిద్ధం అవుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికైనా దొంగ దీక్షలు మానేసి, రైతులకు ప్రయోజనం కలిగేలా నడుచుకోవాలని నెటిజన్లు, తెలంగాణ రైతాంగం చురకలు అంటిస్తున్నారు.