న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. వైరస్పై పోరాడేందుకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. దేశీయ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన ‘విరాఫిన్’ (పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2బీ-pegIFN) ఔషధం పరిమిత అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతినిచ్చింది. మధ్యస్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఈ ఔషధం అందిస్తారు. కరోనా నిర్ధారణ అనంతరం ప్రారంభ దశలోనే ఈ ఔషధం అందిస్తే రోగులు త్వరగా కోలుకోవడంతోపాటు తీవ్ర సమస్యల నుంచి బయటపడవచ్చని జైడస్ సంస్థ తెలిపింది. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో ఈ మందు అందుబాటులోకి రావడం కరోనా రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నది. విరాఫిన్తో చికిత్స అందించిన రోగులకు వారం రోజుల్లోనే నెగెటివ్ వచ్చినట్టు ఆ సంస్థ తెలిపింది. అలాగే రోగులకు మెడికల్ ఆక్సిజన్ అవసరాన్ని కూడా ఇది గణనీయంగా తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. వాస్తవానికి హెపటైటిస్ సీ వైరస్తో తలెత్తే కాలేయ వ్యాధి చికిత్స కోసం ఈ ఔషధాన్ని రూపొందించారు. పదేండ్ల కిందట ఇది మార్కెట్లోకి విడుదలైంది. కరోనాకు చికిత్స కోసం ఈ ఔషధంపై జైడస్ క్యాడిలా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ఇదే సంస్థ ఒక వ్యాక్సిన్ను సైతం అభివృద్ధి చేస్తున్నది. మరోవైపు, అదుపుతప్పిన హృదయ స్పందనల నియంత్రణ కోసం తాము అభివృద్ధి చేసిన ప్రొపఫెనాన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబెట్లకు అమెరికా ఔషద నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపినట్టు జైడస్ క్యాడిలా వెల్లడించింది.