Zojila pass : శ్రీనగర్- కార్గిల్- లేహ్ సరిహద్దులోని జోజిలా పాస్ తాత్కాలికంగా మూతపడనుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జనవరి 7వ తేదీ నుంచి ఈ పాస్ను మూసి వేయనున్నారు. శీతాకాలం కావడంతో ఆ ప్రాంతంలో మంచు కురుస్తుండడంతో పాటు చల్లని గాలులు వీస్తున్నాయి. అందుకని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడడం కోసం భారత సైన్యం ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘జోజిలా పాస్ను తాత్కాలికంగా మూసి వేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన వెంటనే మళ్లీ ఈ పాస్ను తెరుస్తాం. స్థానిక ప్రజలను కలవడానికి, సైనికుల రవాణాకు ఈ మార్గం మాకు చాలా కీలకం. అయితే.. ఈ దారిని మూసేస్తుండడతో అత్యవసర సమయంలో ఆర్మీ హెలిక్యాప్టర్లను ఉపయోగిస్తాం’అని విజయక్ అనే అధికారి తెలిపారు. మామూలుగా అయితే.. ప్రతి ఏడాది నవంబర్ తర్వాత ఈ పాస్ను మూసేస్తారు.
సముద్ర మట్టానికి 11,649 అడుగుల ఎత్తు ఉండే జోజిలా పాస్ కశ్మీర్ లోయ, లద్ధాఖ్కు చాలా ముఖ్యమని చీఫ్ ఇంజనీర్ సాకేత్ సింగ్ వెల్లడించాడు. 434 కిలోమీటర్ల దూరం ఉండే జోజిలా పాస్ మార్గం భారత్కు చాలా కీలకమైనది. ఇది కేంద్రపాలిత ప్రాంతమైన లద్ధాఖ్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది.