హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలో 43 మంది ప్రముఖులకు జెడ్+ భద్రత కల్పించినట్టు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. మన దేశంలో వీఐపీలు, వీవీఐపీలకు కొదవే లేదు. వ్యక్తిని బట్టి, హోదాను బట్టి భద్రత కల్పిస్తూ ఉంటారు. అయితే అత్యున్నత భద్రతను ‘జెడ్ ప్లస్’ అంటారు. దీంతోపాటు జెడ్, వై ప్లస్ క్యాటగిరీల్లో ఎంత మందికి భద్రత కల్పిస్తున్నారు? ఇందుకు ఎంత ఖర్చు చేస్తున్నారో వెల్లడించాలంటూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ (యాక్).. ఆర్టీఐ ద్వారా కేంద్ర హోం శాఖను కోరింది. దేశవ్యాప్తంగా 43 ప్రముఖులకు జెడ్ ప్లస్, 66 మందికి జెడ్, 81 మందికి వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్టు హోంశాఖ తెలిపింది. అయితే భద్రత ఖర్చుల వివరాలు పూర్తిగా తమ దగ్గర ఉండవని, భద్రత పొందేవారి వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేసింది.