ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) మరోసారి ఉద్రితక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ అధికారి హత్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. తమకు తుపాకులు (Arms), ఆయుధాలు (Ammunition) అప్పగించాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఎంత చెప్పినా ఆందోళనకారులు శాంతించకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇదంతా రాజ్భవన్, ముఖ్యమంత్రి నివాసానికి అతి సమీపంలోనే జరగడం విశేషం.
ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లోని మోరే ప్రాంతంలో మిలిటెంట్లు ఓ పోలీస్ అధికారిని కాల్చిచంపారు. హెలీప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించడానికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చింగ్థామ్ ఆనంద్ (Chingtham Anand).. మోరే ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో సమీపంలోని నివాస సముదాయాల నుంచి మిలిటెంట్లు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తచేశారు. ఇది పోలీసుల చేతకానితనంతోనే జరిగిందని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అరంబాయ్ తెంగోల్ అనే యువజన సంఘం ఆధ్వర్యంలో.. మణిపూర్ రైఫిల్స్ కాంప్లెక్స్లోని ఆయుధాలను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇంఫాల్లోని సీఎం అధికార నివాసం సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు పెద్దసంఖ్యలో ఉండటంతో పోలీసులు తొలుత వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అది సాధ్యం గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఆందోళనాకరులు చెదిరిపోయారు. ఈ ఘటన అనంతరం రాజధానిలో కర్ఫ్యూ విధించారు.
కాగా, మోరే (Moreh) ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ కుకీ స్టుడెంట్స్ ఆర్గనైజేషన్ (KSO) సంఘాలు 48 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆందోళన నిర్వహించారు. దీంతో మోరే పోలీస్ స్టేషన్కు అదనపు బలగాలను తరలించారు.