పనాజీ: గోవాలో అధికారంపై కన్నేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అందుకు అనుగుణంగానే అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నది. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో కసరత్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇవాళ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ గోవా రాజధాని పనాజీలో ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మీరు అనవసరంగా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ నా దృష్టిలో ఆ పార్టీ గోవాలో ఎక్కడా పోటీలో ఉంటుందని అనిపించడం లేదు’ అని మీడియాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
తృణమూల్ కాంగ్రెస్ గోవాలో ఒక్కశాతం ఓట్లు కూడా లేవని కేజ్రివాల్ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు నెలల క్రితమే గోవాలోకి వచ్చిందని, ప్రజాస్వామ్యంలో అధికారం అంత సులువు కాదని అన్నారు. అధికారంలోకి రావాలంటే ఎంతో కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని, ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ ప్రజల బాగోగులు చూడాల్సి ఉంటుందని కేజ్రివాల్ అభిప్రాయపడ్డారు.