చండీగఢ్: ‘రెండు రోజుల్లో ఖాళీ చేయండి. లేకపోతే పరిణామాలు ఎదుర్కోండి’ అని మురికివాడలో నివసిస్తున్న ముస్లిం నివాసితులను బెదిరించారు. ఈ మేరకు వీహెచ్పీ పేరుతో ఉన్న పోస్టర్లు (Posters In Gurugram) ఆందోళన కలిగించాయి. బీజేపీ పాలిత హర్యానాలో ఈ పోస్టర్లు వెలిశాయి. గురుగ్రామ్లోని స్లమ్ ఏరియా అయిన సెక్టార్ 69లో ఎక్కువగా ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆదివారం రాత్రి ఆ ప్రాంతంలో టీ షాప్ పక్కనున్న గోడకు ఒక పోస్టర్ అంటించి ఉంది. ఆ ప్రాంతంలోని ముస్లింలు ఈ నెల 28 (సోమవారం)లోగా తమ ఇండ్లను ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మరణాలకు వారే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ‘మీ మాన, ప్రాణాలు కాపాడుకునేందుకు రెండు రోజులే గడువు’ అని అందులో బెదిరించారు.
కాగా, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్దళ్ ఈ మేరకు హెచ్చరించినట్లు ఉన్న ఈ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపాయి. దీంతో ముస్లిం మహిళలు భయాందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఈ పోస్టర్లను తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు హర్యానాలోని నూహ్ జిల్లాలో జూలై 31న వీహెచ్పీ చేపట్టిన యాత్రపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన హింసాకాండలో ఇద్దరు హోంగార్డులతో సహా ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు ఇండ్లకు నిప్పుపెట్టారు. పలు షాపులను లూఠీ చేశారు. మూడు రోజుల వరకు కొనసాగిన అల్లర్లు గురుగ్రామ్ వరకు వ్యాపించాయి.