TVK chief Vijay : ప్రభుత్వాల అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తూ.. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే అందరూ తనను టార్గెట్ చేశారని టీవీకే చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) ఆరోపించారు. తమ పార్టీ నిర్వహించే బహిరంగసభలకు కూడా డీఎంకే ప్రభుత్వం (DMK govt) అనుమతి ఇవ్వట్లేదన్నారు. అందువల్లే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను కలవలేకపోతున్నానని అన్నారు.
ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని విజయ్ హామీ ఇచ్చారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తాను వెనక్కి తగ్గనని, అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. వేలూరులో నిర్వహించిన బహిరంగసభలో విజయ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అవినీతిని, నేరాలను అరికట్టడంలో స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందని విజయ్ ఆరోపించారు. త్వరలో జరగనున్నవి ఎన్నికలు మాత్రమే కాదని, తమిళనాడు ప్రజలకు, అవినీతి ప్రభుత్వానికి మధ్య యుద్ధమని విజయ్ అన్నారు. ఈ యుద్ధంలో ప్రజలే విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల్లో తనను ఎలాగైనా ఓడించాలనే ఆలోచనతో స్టాలిన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ఓటువేస్తే బీజేపీకి వేసినట్లేనని విజయ్ చెప్పారు. ఎన్నికల్లో ఓటమి భయంతో స్టాలిన్ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం ఆ పార్టీ నేతలకు అలవాటేనని ఎద్దేవా చేశారు.