పట్నా: జేడీయూ సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూ తనపై రోజుకో విమర్శ చేస్తున్న కుశ్వాహపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన నితీశ్.. ఇవాళ నేరుగా విమర్శించారు. ‘పార్టీలోకి ఎంతో మంది వస్తుంటారు. పోతుంటారు. నువ్వు కూడా పోతే పో, మేం పట్టించుకోం. అంతేగానీ పార్టీలో ఉంటూ రోజుకో విమర్శ చేయడం కరెక్టు కాదు. అలా చేస్తున్నావంటే నీ మైండ్ నీ దగ్గర లేదని అర్థం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పార్టీని కాపాడుకోవడంపై అప్రమత్తంగా ఉండటం లేరంటూ నితీశ్కుమార్కు ఉపేంద్ర కుశ్వాహ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. అంతేగాక పార్టీని రక్షించుకోవడంపై పరిష్కార కోసం ఈ నెల 19, 20 తేదీల్లో సమావేశమవుదామని జేడీయూ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర కుశ్వాహ తీరుపై నితీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కుశ్వాహ బీజేపీతో టచ్లో ఉంటూ నితీశ్పై ఆరోపణలు చేస్తున్నాడని జేడీయూ నేతలు ఆరోపిస్తున్నారు.