UP Assembly Results | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొటములపై పుక్కిటి పురాణాలు ప్రచారంలో ఉండేవి. ఆ పురాణాలన్నీ వట్టివేనని యోగి ఆదిత్యనాథ్.. 2022 అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశారు. 37 ఏండ్ల తర్వాత తొలిసారి బీజేపీ పూర్తి మెజారిటీతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ఎన్నికల్లో విజయానికి సంబంధించి ప్రచారంలో ఉన్న మూడు పుక్కిటి పురాణాలను యోగి ఆదిత్యనాథ్ బ్రేక్ చేసి చరిత్ర సృష్టించారు. అసెంబ్లీకి పోటీ చేసి.. విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారు. నొయిడాకు 20 సార్లకుపైగా వెళ్లి వచ్చినా.. సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు.
నొయిడాకు వెళ్లిన యూపీ నాయకుడెవరూ తిరిగి సీఎం కాలేదని ఈ పురాణం.. ఈ ట్రిక్ 1985లో మొదలైంది. తొలుత వీర్ బహదూర్, 1980లో నారయణ్ దత్ తివారీ.. నొయిడాకు వెళ్లిన తర్వాత ఓటమి పాలయ్యారు. తర్వాత ములాయం సింగ్ యాదవ్.. నొయిడాకు వెళ్లడానికి సిద్ధ పడలేదు. 2011లో మాయావతి నొయిడాకు వెళ్లారు. 2012లో ఓటమి పాలయ్యారు. అంతకుముందు రాజ్నాథ్ సింగ్.. తర్వాత అఖిలేశ్ యాదవ్.. ఢిల్లీ నుంచి లేదా లక్నో నుంచి నొయిడాలో కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేవారు. కానీ, యోగి ఆదిత్యనాథ్ 20 సార్లకుపైగా నొయిడాకు వెళ్లి వచ్చారు.
ఎక్స్ప్రెస్వేకు రాజకీయాలకు సీఎంకు లింక్ పెట్టారు. 2002లో మాయావతి సీఎంగా తాజ్ ఎక్స్ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన వెంటనే అధికారం కొల్పోయారు. తాజ్ ఎక్స్ప్రెస్ వేకు పూర్తి చేసిన అఖిలేశ్ యాదవ్.. యమునా ఎక్స్ప్రెస్గా పేరు పెట్టారు. ఆగ్రా ఎక్స్ప్రెస్ వే కూడా ప్రారంభించారు. 2017లో అఖిలేశ్ యాదవ్ ఓటమి పాలయ్యారు. యోగి ఆదిత్యనాథ్ హయాంలో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే, బుందేల్ఖండ్-గంగా ఎక్స్ప్రెస్వే ఏర్పాటు చేశారు. కానీ ఈ ఎక్స్ప్రెస్వేలు ఏర్పాటు చేసినా యోగి ఆదిత్యనాథ్ విజయం సాధించారు.
సీఎం కావాలనుకునే నేతలు యూపీలో అసెంబ్లీకి పోటీ చేసేవారు కాదు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్, అంతకుముందు మాయావతి, అఖిలేశ్ యాదవ్.. ఎమ్మెల్సీలుగా ఎన్నికై సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతకుముందు గున్నౌర్ సీటు నుంచి గెలుపొందిన ములాయం సింగ్ యాదవ్.. సీఎంగా బాధ్యతలు చేపట్టినా కొద్దికాలమే సీఎంగా ఉన్నారు. కానీ ఈ దఫా గోరఖ్పూర్ నుంచి యోగి ఆదిత్యనాథ్, కర్హాల్ స్థానంలో అఖిలేశ్యాదవ్ పోటీ చేసి విజయం సాధించారు.