బెళగావి, జనవరి 31: ఎన్నికల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్ప ప్రకటించారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. అయితే రాష్ట్రమంతటా తిరిగి పార్టీని నిర్మిస్తానని, కర్ణాటకలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు పని చేస్తున్నానని తెలిపారు. బెళగావిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఎమ్మెల్యే, సీఎం పదవులు చేశానని, 80వ పడిలో ప్రవేశిస్తున్న తాను మళ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలే లేవని తెలిపారు. షికారిపురలో ‘పురసభ’ అధ్యక్షుడిగా ఎన్నికల రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన యెడియూరప్ప.. 1983లో షికారిపుర నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2021 జూలైలో ఆయన కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేశారు.