న్యూఢిల్లీ, జూలై 17: ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో గంగ, యమునా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఢిల్లీ, ఉత్తరాఖండ్లో నదీ సమీప ప్రాంతాలు, కాలువల వెంబడి నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ అధికారులు సోమవారం హెచ్చరికలు జారీచేశారు. భీమ్గోడా బ్యారెజ్లో ఓ గేటు ధ్వంసం కాగా, హరిద్వార్లో గంగానది 293 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీచేసింది. అలకనందాలోనూ నది ప్రవాహ మట్టం పెరిగిందని జిల్లా అధికారులు తెలిపారు. ఢిల్లీలో యమునా నది 205.80మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నదని, నది ప్రవాహం ఇంకా ప్రమాదకరస్థాయిలోనే ఉందని అధికారులు తెలిపారు. దోమల బెడద పెరిగి ప్రజలు పెద్ద సంఖ్యలో రోగాలబారిన పడుతున్నారు. ఢిల్లీలో 160 డెంగ్యూ, 54 మలేరియా కేసులు నమోదయ్యాయి.