న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ జూన్ 16ను అంత త్వరగా మర్చిపోబోరని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే అన్నారు. నేపాల్ వంటి చిన్న దేశాలను బెదిరించి, లొంగదీసుకునే చైనాకు గల్వాన్ లోయలో ఆ రోజు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. పొరుగు దేశం వేధింపులను సవాల్ చేయడాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం భారత సైన్యానికి వచ్చిందని తెలిపారు. తూర్పు లఢక్లో 2020 జూన్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, చైనా సైన్యానికి జరిగిన నష్టాన్ని ఆ దేశం స్పష్టంగా చెప్పులేదు. జనరల్ నరవణే తన జీవిత కథను ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పేరుతో రాశారు. ఇది వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కావడం తన జీవితంలో అత్యంత విచారకరమైన రోజులని నరవణే ఆవేదన వ్యక్తం చేశారు. జిన్పింగ్ పుట్టిన రోజు కూడా జూన్ 16నే అని, ఆ రోజును ఆయన తొందరగా మర్చిపోబోరని అన్నారు. గత రెండు దశాబ్దాల్లో చైనీయులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దారుణంగా ప్రాణాలను కోల్పోవడం అదే మొదటిసారి అని చెప్పారు.