ప్రపంచం.. ఒక్క మనిషి సొత్తే కాదు. మనిషే సర్వస్వం కాదు. మనిషి కూడా ఇందులో భాగం. రక రకాల జీవరాశులు, చెట్లు, చేమలు, జంతువులు… ఇలా అన్ని కలగలిపితేనే ప్రపంచం. మనిషి జీవితమే ఓ విచిత్ర జీవితం. ఆ విచిత్ర జీవనం నుంచి కాస్త రిలీఫ్ పొందడానికి అప్పుడప్పుడు ప్రకృతికి చేరువవుతాడు. రకరకాల జీవరాశులను చూస్తూ మానసిక ఆహ్లాదాన్ని పొందుతాడు. అవేవీ లేకుండా… కేవలం మనుషులే ఉంటే.. ఊహించుకుంటేనే భయం పుడుతోంది కదా… మరో దశాబ్దం తర్వాత పరిస్థితి ఇలాగే మారిపోతోందని ఓ సర్వే తేల్చి చెప్పింది.
‘వరల్డ్ వైడ్ ఫండ్’ అనే సంస్థ పశువులు, పక్షులు, చెట్లు వీటిపై అధ్యయనం చేస్తుంది. ఈ సంస్థ తాజాగా ఓ తీవ్రమైన హెచ్చరికే చేసింది. మరో దశాబ్ద కాలంలో ఈ భూ ప్రపంచం మహా వినాశనం వైపు దారితీస్తుందని, రక రకాల చెట్లు, జంతువులు ఇవన్నీ లుప్తమైపోతాయని తీవ్రంగా హెచ్చరించింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ 2021 సంవత్సరంలో ‘విన్నర్-లూజర్’ పేరుతో ఓ రిపోర్టును బయటపెట్టింది.
డైనోసార్ లుప్తమైన తర్వాత… అంత పెద్ద జంతు వినాశనం ఎప్పుడూ జరగలేదని, కానీ.. ఓ దశాబ్దం తర్వాత అంత పెద్ద జంతు వినాశనం జరగబోతోందని ఆ సంస్థ తేల్చింది. దాదాపుగా ఓ కోటి వృక్ష జాతులు, జంతు జీవాలన్నీ వినాశనమవుతాయని ఆ సంస్థ పేర్కొంది. ఏనుగులు, ధృవపు ఏలుగుబంట్లు, సొర చేపలు, కప్పలు, చేపలు… ఇలా ఓ 10 లక్షల జీవాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఆ సంస్థ హెచ్చరించింది.
అయితే 142,500 జాతులను రెడ్లిస్ట్లో చేర్చామని, అందులో40 వేల జాతులు లుప్తమవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా ఆఫ్రికా అడవుల్లో ఉండే ఏనుగులు అంతరించిపోవడానికి అతి దగ్గరగా ఉన్నాయని, గత 31 సంవత్సరాల్లో 86 శాతం మేర ఏనుగుల సంఖ్య తగ్గిందని ‘వరల్డ్వైడ్ ఫండ్’ తెలిపింది.