పాట్నా : బిహార్లోని నలందలో కరోనా వ్యాక్సినేషన్లో కలకలం చోటు చేసుకున్నది. ఇద్దరు పిల్లలకు అనుమతి ఇచ్చిన టీకాకు బదులుగా మరో వ్యాక్సిన్ వేయడం కుటుంబంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. దేశవ్యాప్తంగా 15-18 సంవత్సరాల పిల్లలకు కొవిడ్ టీకాల సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇద్దరు సోదరులకు వ్యాక్సినేషన్ సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కొవాగ్జిన్ టీకా కాకుండా కొవిషీల్డ్ వేశారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ టీకా పిల్లలపై ట్రయల్స్ జరుగలేదు.
దీనిపై టీకా కేంద్రం సిబ్బందిని ప్రశ్నిస్తే కొవిషీల్డ్ టీకా తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బిహార్ షరీఫ్లోని ప్రొఫెసర్ కాలనీకి చెందిన పీయూష్ రంజన్ తన ఇద్దరు పిల్లలు ఆర్యన్, కిరణ్కు టీకా వేయించేందుకు స్లాట్ను బుక్ చేశాడు. సోమవారం నలంద ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐఎంఏ టీకా కేంద్రానికి వెళ్లి టీకాలు వేయించారు. టీకాలు వేసిన అనంతరం వారికి కొవాగ్జిన్ కాకుండా కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసినట్లు తేలింది. దీనిపై అన్నదమ్ములిద్దరూ ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారిని అక్కడ ఉన్న అధికారులు గంటన్నర పాటు పరిశీలనలో ఉంచారు.
ఆ తర్వాత ఏదైనా సమస్య ఉంటే వైద్య బృందాన్ని ఇంటికి పంపిస్తామని చెప్పి పంపించారు. అయితే, సర్టిఫికెట్లో మాత్రం కొవాగ్జిన్ టీకా ఇచ్చినట్లు నమోదైంది. వ్యాక్సినేషన్లో వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పిల్లల తండ్రి ప్రియరంజన్ ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యంపై ఉద్యోగుల నుంచి సివిల్ సర్జన్ వివరణ కోరారు. అయితే, ఇంతకు ముందు వ్యాక్సిన్ వేసిన ఉద్యోగికి పాజిటివ్ రావడంతో సెలవుపై వెళ్లాడని, కొత్త జీఎన్ఎంతో పొరపాటు జరిగిందని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే వైద్యశాఖ తరఫున పూర్తి సహాయం అందిస్తామని పిల్లల తండ్రికి హామీ ఇచ్చారు.