బెంగళూరు, మే 31: విద్య కాషాయీకరణ ప్రయత్నాల పట్ల కర్ణాటకలోని బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాషాయీకరణ లక్ష్యంతో పాఠ్యపుస్తకాల్లో చేపట్టిన మార్పులు చేర్పులపై విద్యావేత్తలు, రచయితలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనల బాటపట్టాయి. బొమ్మై సర్కార్ తీరుకు నిరసనగా పలువురు రచయితలు తాజాగా ప్రభుత్వ కమిటీలు, సంస్థలకు రాజీనామా చేశారు. రాష్ట్రకవి జీఎస్ శివరుద్రప్ప ప్రతిష్ఠాన అధ్యక్షుడిగా ఉన్న ఎస్జీ సిద్ధరామయ్యతో పాటు రచయితలు హెచ్ఎస్ రాఘవేంద్రరావు, నటరాజ బుదాలు, చంద్రశేఖర్ నంగ్లిలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు పేర్కొంటూ సీఎం బొమ్మైకు సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర విద్య, సాంస్కృతిక, రాజకీయ వ్యవస్థలపై జరుగుతున్న రాజ్యాంగ విరుద్ధ దాడి, అణచివేత తమను ఆందోళనకు గురిచేసిందని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర, సమాఖ్య నిర్మాణాన్ని అణగతొక్కుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటాన్ని ఆక్షేపించారు. రాష్ట్రకవి కువెంపు ప్రతిష్ఠాన అధ్యక్షుడు హంపా నాగరాజయ్య రాజీనామా చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై తన కృషికి ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని విద్యావేత్త వీపీ నిరంజనారాధ్య తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలు, విద్యావిధానాలను పాటించకుండా విద్యకు మతం, కాషాయ రంగు పులిమేందుకు దిగిందని విమర్శించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
పాఠ్యపుస్తకాల కాషాయీకరణకు వ్యతిరేకంగా పలు విద్యార్థి సంఘాలు మంగళవారం బెంగళూరులో ఆందోళనలు చేపట్టాయి. ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసనలు ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పాఠ్యపుస్తకాల సవరణ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాల్లో మార్పులకు వ్యతిరేకంగా సోమవారం పలువురు సామాజిక ఉద్యమకారులు, న్యాయవాదులు బెంగళూరులోని సివిల్ కోర్టు ముందు ఆందోళన నిర్వహించారు.